- ఆప్ కార్యాలయాలను ఖాళీ చేయడంపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : రూస్ అవెన్యూలోని పార్టీ కార్యాలయాలను ఖాళీ చేయడానికి ఆప్కు సోమవారం సుప్రీంకోర్టు జూన్ 15 వరకూ గడువు ఇచ్చింది. న్యాయపరమైన మౌలిక సదుపాయాలను విస్తరించడం కోసం ఢిల్లీ హైకోర్టుకు ఈ స్థలాన్ని కేటాయించడంతో సుప్రీంకోర్టు ఆప్కు ఈ సమయాన్ని ఇచ్చింది. తమ కార్యాలయాల ఏర్పాటు కోసం వేరొక భూమి కేటాయింపు కోసం ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ (ఎల్ అండ్ డిఒ)ను సంప్రదించాలని కూడా ఆప్కు సుప్రీంకోర్టు తెలిపింది. ఆప్ దరఖాస్తుపై నాలుగు వారాల్లో నిర్ణయాన్ని తెలియచేయాలని ఎల్ అండ్ డిఒను ఆదేశిస్తామని వెల్లడించింది. రూస్ అవెన్యూలో స్థలంలో కొనసాగడానికి ఆప్కు చట్టబద్ధమైన హక్కు లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.