కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె

Mar 25,2024 20:40 #ap congress, #join, #ys sharmila

ప్రజాశక్తి-అమరావతి : ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ నేడు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దారా పద్మజకు ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని షర్మిల ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

గోకుల్‌ కృష్ణారెడ్డికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్‌ షర్మిలనంద్యాల కలెక్టరేట్‌ : నంద్యాల జిల్లా నంద్యాల జడ్‌పిటిసి సభ్యులు గోపవరం గోకుల్‌ కృష్ణా రెడ్డి వైసిపికి సోమవారం రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో పిసిసి చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా అహ్వానించారు. నంద్యాల వైసిపి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి పని తీరు నచ్చక, నంద్యాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని భావించి ఈ పార్టీలో చేరినట్లు గోకుల్‌ తెలిపారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలుస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు.

”వైసీపీ నాయకత్వం నిరంకుశ ధోరణితో విసుగు చెంది ఇవాళ కొందరు నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎంతో సంతోషంతో వారికి స్వాగతం పలుకుతున్నాను. నంద్యాల జడ్పీటీసీ గోకుల్‌ కృష్ణారెడ్డి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ, ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఎస్టీ సెల్‌ ఇన్చార్జి సృజన నేడు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి వారు కృషి చేస్తారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం వారు కాంగ్రెస్‌ పార్టీతో కలిశారు” అని షర్మిల వివరించారు.

➡️