ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.సరైన పత్రాలు లేని నగదు, నగలును సీజ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో రూ.54 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో ప్రొద్దుటూరుకు చెందిన నేలటూరు ఉబేదుల్లాకు చెందిన కారులో 830 గ్రాముల బంగారు ఆభరణాలకు సంబంధించి బిల్లులు లేనందున సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడులో ఏలూరు జిల్లా కాటిపాడుకు చెందిన ఎం.నటరాజ నుంచి రూ.2 లక్షలు, ఎస్.వినోద్కుమార్ నుంచి రూ.1.50 లక్షలను నగదును స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీ లారీలో రూ.91 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం చెక్పోస్టు వద్ద రూ.లక్ష, భీమడోలు మండలం పొలసానిపల్లి- ద్వారకాతిరుమల రహదారిపై రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తెలిపారు.