- విమానంలో హానికర ద్రవం తాగి అస్వస్థతకు గురైన మయాంక్
ఢిల్లీ : అగర్తల నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. అగర్తలలోని ఐఎల్ఎస్ హాస్పిటల్లో అతడు చికిత్స పొందుతున్నాడు. మయాంక్ ‘ఓరల్ ఇరిటేషన్’కు గురయ్యాడని, అతడి పెదాలు వాచిపోయాయని ఐఎల్ఎస్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జనవరి 30న హాస్పిటల్లో చేరాడని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వివరించింది. అస్వస్థత నేపథ్యంలో మయాంక్ రేపు సూరత్లో రైల్వేస్తో జరగాల్సిన మ్యాచ్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో మనీష్ పాండే ఆడనున్నాడు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం మయాంక్ అగర్వాల్ అగర్తల నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని ఎక్కాడు. ఫ్లైట్లో తాను కూర్చున్న సీటు ముందు పౌచ్లో ఉన్న ద్రవాన్ని తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని పలు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. గొంతులో వాపు, బొబ్బలు రావడంతో వెంటనే అతడిని విమానం దించి స్థానికంగా ఉన్న ఐఎల్ఎస్ హాస్పిటల్కు తరలించారని రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా ఆసుపత్రి నుంచి తన మేనేజర్ సహాయంతో మయాంక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టామని పశ్చిమ త్రిపుర ఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు.