ప్రమాదానికి గురైన ఎయిర్‌ఫోర్స్‌ విమానం

రాజస్థాన్‌ : ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. సాధారణ శిక్షణా సమయంలో విమానం ప్రమాదానికి గురైనట్లు తెలిపింది. జైసల్మేర్‌ జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధని జాజియా గ్రామంలో ఓ బహిరంగ ప్రదేశంలో విమానం కూలిపోయినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, వైమానిక దళ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ ఏర్పాటు చేసినట్లు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది.

➡️