బరిలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు
నిఘా అధికారుల కన్నుగప్పి నగదు తరలింపు
నోటిఫికేషన్కు ముందే రూ.100కోట్లు నగదు , డ్రగ్స్,లిక్కర్ పట్టివేత
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :రానున్న సాధారణ ఎన్నికలు వైసిపి, టిడిపికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పీఠమే లక్ష్యంగా ఆర్ధికంగా, సామాజికంగా బలంగా ఉన్న అభ్యర్ధులను రెండు పార్టీలు పోటీలో నిలిపాయి. అభ్యర్ధుల్లో అత్యధికంగా పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఉండటంతో డబ్బును మంచినీళ్ల ప్రాయం ఖర్చు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు అత్యంత కాస్ట్లీ ఎన్నికలుగా మారనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 18 న విడుదల కానుండగా, ఇప్పటికే రూ.100కోట్ల విలువైన డబ్బు, మద్యం, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్ను( ఉచితాలు) ఇతర వస్తువులను ఈనెల 11 నాటికి జప్తు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్కుమార్మీనా వెల్లడించారంటే ఈ ఎన్నికల్లో ధన ప్రభావం ఏ స్దాయిలో ఉంటుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వెలువడక ముందే పోటీలో ఉండే అభ్యర్ధులు విచ్చల విడిగా కోట్లాది రూపాయిలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి యదేశ్చగా తరలిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు విచ్చల విడిగా ఖర్చు చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయపార్టీలు ఒక్కోనియోజకవర్గానికి ఆయా పార్టీలు రూ.70 నుంచి రూ.100 కోట్లు ఖర్చు ఖర్చు పెట్టే అవకాశం లేక పోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నిఘా కళ్లుకప్పిగప్పి…
అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను ఉంచేందుకు ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. వీటికి తోడు అదనంగా పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, ఫారెస్ట్, ఇడి, ఎన్సిబి, ఆర్పిఎఫ్, కస్టమ్స్కు తోడు అదనంగా మరో 20 ఏజెన్సీలను ఎన్నికలను రంగంలోకి దించారు. ఓటర్లను ప్రభావితం చేసే వస్తువులపై నిరంతరం నిఘా వేసేందుకు ఏజెన్సీలు పనిచేస్తుండగా వీరి కళ్లు గప్పి నగదును భారీగా తరలించేందుకు రాజకీయపార్టీలు గతానికి భిన్నంగా ఆర్టీసీ కార్గోలను సైతం ఉపయోగించుకుంటున్నతీరును ఎన్నికల అధికారులు బయటపెట్టారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఈనెల 7న ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఎపిఎస్ ఆర్టిసి కార్గో సర్వీస్ వాహనంలో డ్రెఫ్రూట్స్్ పెట్టెల మధ్య తరలిస్తున్న రూ.22.63లక్షల నగదును ప్ల్తెయింగ్ స్వ్కాడ్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెం వస్తున్న ఆర్టిసి కార్గో వాహనం పట్టణంలోకి ప్రవేశించే సమయంలో అధికారులు పట్టుకున్నారు. నగదుకు సంబందించి ఎటువంటి రసీదులు లేక పోవడంతో జంగారెడ్డి గూడెం పోలీసులు సీజ్ చేశారు.
యధేశ్చగా తాయిలాలు :
ఎన్నికల నిబంధనలను తూట్లు పొడుస్తూ అధికారపార్టీ అభ్యర్ధులు ఇప్పటికే వలంటీర్లు, ఆర్పిలకు గిప్ట్లు, నగదును పంపణీ చేసినట్లు ఇప్పటికే మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఎన్నికల ప్రవర్తనా నిబంధనలకు విరుద్ధంగా అనేక ప్రాంతాల్లో వలంటీర్లు అధికారపార్టీ అభ్యర్ధులతో కలిసి ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పలువురిని ఇప్పటికే తప్పించింది.