కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి లౌకిక విలువలు, సమానత్వం అన్నవి నచ్చని అంశాలు. అందుకనే పార్లమెంట్ నూతన భవనం ప్రారంభంలో సభ్యులకు ఇచ్చిన రాజ్యాంగ పుస్తకాల ప్రవేశికలో సెక్యులర్, సోషలిస్టు అన్న పదాలను తొలగించారు. ఎమర్జెన్సీలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాలను చేర్చారు కనుక ఆ పదాలను తాము తొలగించినట్లు వివరణ ఇచ్చారు. కాని వాస్తవం ఏమిటంటే ఆచరణలో రాజ్యాంగ మూల స్వభావాన్నే బిజెపి మార్చాలనుకొంటోంది. ప్రభుత్వాన్ని మతంతో కలగాపులగం చేస్తోంది. మత సామరస్యం కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడిన మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని అనధిóకారికంగా ఆకాశానికి ఎత్తుతోంది. గాంధీజీ హత్య కేసులో సరైన సాక్ష్యాలు లేక బయటపడిన సావర్కర్ విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రతిష్టించింది.
కాకతాళీయమో! కాదో! కానీ భారతరత్న బాబాసాహెబ్ డా|| బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి రోజే (డిసెంబర్ 6) కాషాయ పరివారం బాబ్రీ మసీదును కూల్చింది. భారత రాజ్యాంగమన్నా, చర్చి, మసీదులన్నా వారికి చెప్పలేనంత కడుపు మంట. దేశ పౌరుల్లో పర మత ద్వేషభావాన్ని పెంచి అధికారంలోకి రావడం కోసం వారు బాబ్రీ మసీదును లక్ష్యం చేసుకొన్నారు. ఇప్పుడు లౌకికతత్వం, రాజకీయ ప్రజాస్వామ్యం ప్రబోధించే భారత రాజ్యాంగాన్ని దాని విలువలను నీరుగార్చే పనిలో ఉన్నారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, పౌరులందరికీ వర్తించే చట్టం, ప్రజలందరికీ జీవించే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ వంటి విలువలకు పాడె కడ్తున్నారు.
భారత రాజ్యాంగం మతంతో నిమిత్తం లేకుండా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా కల్పించింది. హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్లు కోరుకొన్నదే బిజెపి కూడా కోరుకొంటున్నది. భారతదేశం హిందువులదని, ఈ దేశంలో క్రైస్తవులు, ముస్లింలు తమ నివాసాన్ని కొనసాగించాలనుకొంటే రెండవ తరగతి పౌరుల్లా, హిందువులకు లోబడి బతకాలని ఆ సంస్థల సిద్ధాంతం. వినాయక్ దామోదర్ సావర్కర్, మహదేవ్ సదాశివరావ్ గోల్వాల్కర్ చాలా స్పష్టంగానే తమ రాతల్లో ఈ సిద్ధాంతాన్ని ప్రవచించారు. కాని భారత రాజ్యాంగం ఆ వాదనను పట్టించుకోలేదు. పౌరులందరికీ ఒకే విలువగల ఓటు హక్కునిచ్చింది. కుల మతాలతో నిమిత్తం లేకుండా మహిళలతో సహా భారత పౌరులందరికీ ఒకే రీతిగా చట్టాలు అమలవుతాయి. వారసత్వ చట్టాల్లో మాత్రం కొన్ని తేడాలున్నాయి.
భారతీయులందరూ ఒక జాతి కాదంటూ రెండు జాతుల సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించింది సావర్కర్. బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకొని అండమాన్ జైలు నుండి విడుదలయిన సావర్కర్ బ్రిటిష్ పాలకులకు ఇచ్చిన మాట ప్రకారం స్వతంత్ర పోరాటం నుండి దూరంగా ఉన్నారు. హిందూ మహాసభకు అధ్యక్షుడయ్యాడు. భారత దేశంలో హిందూ, ముస్లిం రెండు జాతులున్నాయని సిద్ధాంతీకరించారు. ముస్లిం లీగ్ అధ్యక్షుడు మహ్మదాలీ జిన్నా ఆ తర్వాత అదే వాదనను అందుకొన్నారు. ఫలితం భారతదేశ విభజన. ‘విభజించు పాలించు’ విధానాన్ని వర్తింపచేసిన బ్రిటిష్ వలస పాలకులకు కావాల్సింది అదే కాగా ఆర్ఎస్ఎస్, దాని పరివారం విభజన పాపాన్ని మొదట మహాత్మా గాంధీ నెత్తికి చుట్టింది. ఇప్పుడు నెహ్రూ నెత్తికి చుడుతున్నారు. మహాత్ముడిపై గౌరవం ఒలకబోస్తూనే స్వాతంత్య్రోద్యమంలోకి విశాల ప్రజానీకాన్ని సమీకరించిన ఆయన కృషిపై దుప్పటి కప్పి ఆయనను ‘స్వచ్ఛత’కు పరిమితం చేశారు. పనిలో పనిగా ‘స్వచ్ఛ భారత్’ పేర 0.5 శాతం పన్నును జిఎస్టికి చేర్చారు.
రాజ్యాంగ రచనా సంఘానికి అంబేద్కర్ అధ్యక్షుడే అయినా, అనేక రకాలైన సాంప్రదాయ వాదులతో కూడింది మన రాజ్యాంగ సభ. ఆ సభలో కొందరు పెద్దలకు హిందూ మహాసభకు ఉండే ఛాందస, ఒంటెత్తు భావనలు ఉన్నాయి. అయినప్పటికీ స్వాతంత్రోద్యమం నాటి విలువలపై ఆధారపడి భారత రాజ్యాంగ నిర్మాణం జరిగింది. కాని భారత రాజ్యాంగం మనది కాదు. మువ్వన్నెల జెండా మనది కాదు. భారత రాజ్యాంగం ఒక అతుకుల బొంత. పశ్చిమ దేశాల నుండి అక్కడ కొంత ఇక్కడ కొంత తెచ్చి జోడించారు. అది భారత్కు పనికి రాదు…అంటూ కాషాయ దళాలు ఈసడిస్తుంటాయి. మువ్వన్నెల జెండా కూడా పశ్చిమ దేశాల తరహాలో ఉంది. మన జెండా కాషాయ రంగులో మధ్యలో ఒక చీలికతో ఉండాలని వాదిస్తుంటారు. చిత్పావన్ బ్రాహ్మణులైన పీష్వా పాలకుల కాషాయ జెండానే మన జాతీయ జెండాగా ఉండాలని వారి అభిమతం.
కులమతాలతో నిమిత్తం లేకుండా ఒక నేరానికి ఒకే శిక్ష విధించాలని చెప్పే మన చట్టాలు సహజంగానే వారికి జీర్ణం కానివి. వర్ణం ప్రకారం శిక్షలు, హక్కులు, ఆస్తులు ఉండాలని మనుస్మృతి చెప్తుంది. అందుకనే అంబేద్కర్ మహర్ పోరాటం సందర్భంగా మనుస్మృతిని తగలబెట్టారు. అలాంటి మనుస్మృతి సాంప్రదాయవాదులకు శిరోధార్యం. మనుస్మృతిని తగలబెడితే వారు విలవిలలాడతారు. ఫ్యూడల్ ప్రభువుల ప్రాపకంతో వారి పాత్రతో మతతత్వ పార్టీలైన హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, ముస్లింలీగ్ పుట్టుకొచ్చాయి. కనుక వాటికి ఇప్పటికీ ఫ్యూడల్ విలువల పట్ల వారికి మోజు. ఆ విలువలు కష్టజీవులనే కాదు, మహిళలనూ అణిచి వుంచాలని చూస్తాయి. భారత రాజ్యాంగం మహిళలకు సమాన పౌరసత్వాన్ని కల్పిస్తోంది.
స్వతంత్ర పోరాటం సందర్భంగా సామాజిక, ఆర్థిక రంగాల్లో చేయాల్సిన పోరాటాన్ని, తన వర్గ స్వభావం వల్ల కాంగ్రెస్ నాయకత్వం వాయిదా వేసింది. స్వాతంత్య్రం వచ్చాక వాటి సంగతి చూసుకోవచ్చని చెప్పింది. కాని స్వతంత్ర భారతంలో కూడా వాటిని సమగ్ర దృష్టితో చేపట్టలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల దృష్టితో క్రమంగా మృదు హిందూత్వను అనుసరించింది. ముస్లింలలో ప్రజాస్వామిక సంస్కరణల కోసం ప్రయత్నించకుండా సాంప్రదాయ శక్తులను సంతృప్తి పరిచే విధానాన్ని అనుసరిస్తూ అంబేద్కర్ చేసిన హెచ్చరికను పెడచెవినబెట్టారు. తద్వారా ప్రభుత్వాలు మెలమెల్లగా రాజకీయ ప్రజాస్వామ్యానికీ ప్రమాదం తెచ్చిపెట్టాయి.అక్కడో నల్లరాయి ఇక్కడో తెల్లరాయి పేర్చినట్లుగా భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదని అంబేద్కర్ రాజ్యాంగ సభకు రాజ్యాంగాన్ని సమర్పిస్తూ చెప్పారు. పార్టీ క్రమశిక్షణకు పరిమితం కాకుండా సభ్యులు చర్చల్లో అనేక విషయాలను ముందుకు తెచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఒక హెచ్చరిక చేశారు.
”జనవరి 26, 1950తో మనం ఒక వైరుధ్యభరితమైన జీవితంలోకి ప్రవేశిస్తున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. కాని సామాజిక, ఆర్థిక రంగాల్లో అసమానత ఉంటుంది. రాజకీయాల్లో ఒకరికి ఒకే ఓటు, ఒక ఓటుకు ఒకే విలువ అన్న సూత్రాన్ని అనుసరిస్తాం. కాని మన సామాజిక, ఆర్థిక నిర్మాణం కారణంగా మనుషులందరికీ ఒకే విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తాం. ఈ వైరుధ్యాల మధ్య మనం ఎంతకాలం ఉండగలం? సామాజిక, ఆర్థిక రంగాల్లో ఎంతకాలం సమానత్వాన్ని నిరాకరించగలం. చాలా కాలం పాటు ఈ నిరాకరణ సాగితే మనం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన వారమవుతాం. వీలైనంత త్వరగా మనం ఈ వైరుధ్యాన్ని తొలగించాలి. లేకపోతే మనం ఎంతో కష్టపడి రూపొందించుకొన్న రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణం పేలిపోతుంది” అన్నారు.
మోడీ పాలనలో బిజెపి తన మతతత్వ విధానాలను బాహాటంగా అమలు చేయడానికి పూనుకొంది. రాజ్యాంగ సంస్థలను తన రాజకీయ ప్రయోజనాలను సాధించే పనిముట్లగా మార్చుకొంది. ఎన్నికల సంఘం, పోలీసు విభాగాలు వెన్నెముక లేని సంస్థలయ్యాయి. ఎలక్టొరల్ బాండ్ల పేర అవినీతికి, ఆశ్రిత పెట్టుబడిదారులకు ప్రజల సొమ్మును ధారపోసే విధానాలను కాంగ్రెస్ కంటే నిస్సిగ్గుగా అమలు చేస్తోంది. తీవ్రమైన నేర చట్టాల కింద కేసులు బనాయించి ఏళ్ల తరబడి జైల్లో పెడుతోంది. ఆ కేసులు విచారణకు సైతం రావు. నిందితులు అలా జైళ్లలో ఉండిపోవాల్సి వస్తుంది. మీడియా స్వేచ్ఛను కొనేసింది. అడ్డగోలు వాదనలకు వార్తలకు సోషల్ మీడియాను పెంచి పోషిస్తోంది. పార్లమెంట్ను ఒక ప్రహసనంగా మార్చింది. ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన సుద్దులు ఒక్కటీ పాటించదు. తనకు అవసరమైన బిల్లులను పేరుకే పార్లమెంట్లో ప్రవేశపెట్టి తగిన చర్చకు అవకాశమివ్వకుండా ఆమోద ముద్ర వేసుకొంటుంది. రాష్ట్రాల్లోని గవర్నర్లు అధికారిక చొరబాటుదారుల్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడ్తున్నారు. మోడీకి, షా కు మాత్రమే మేము జవాబుదారీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు వాఖ్యలను, తీర్పులను పట్టించుకోవడం లేదు. మెజారిటీ మతతత్వం నియంతృత్వం వైపునకు, మైనారిటీ మతతత్వం టెర్రరిజం వైపు వెళ్తాయన్న అంచనాలను మోడీ ప్రభుత్వం ఆచరణలో అమలు చేసి చూపెడుతోంది.
రాజ్యాంగ సభలో ప్రొ|| కె.టి.షా అనే సభ్యుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1, క్లాజు 1లో సెక్యులర్, ఫెడరల్, సోషలిస్టు అనే పదాలను చేర్చాలని ప్రతిపాదించారు. అంబేద్కర్ ఆ పదాలు అవసరం లేదని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో భాగంగా రాజ్యాంగ ముసాయిదాల్లో భాగంగా అవి ఉన్నాయని చెప్పారు. న్యాయ ప్రక్రియలో అనుసరించాల్సిన సోషలిస్టు సూత్రాలను, సమానత్వం, నిష్పాక్షికత వంటి అంశాలను కూడా ఇదివరకే చేర్చామని చెప్పారు. లౌకిక విలువలకు అంబేద్కర్ గట్టిగా కట్టుబడి ఉన్నారు. న్యాయం-సమానత్వం గురించి బలంగా రాజ్యాంగ ముసాయిదాలో చెప్పామన్నారు. దేశ నిర్మాణం సందర్భంగా అనుసరించాల్సిన సౌభ్రాతృత్వంపై ఆయన సభలో అనర్గళంగా మాట్లాడారు. రాజ్యంగ సభలో జరిగిన చర్చల సరళిని బట్టి చూసినా భారతదేశాన్ని ఒక మత రాజ్యంగా మార్చే భావన ఎక్కడా కన్పించదని న్యాయ నిపుణులు చెప్తున్నారు.కాని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి లౌకిక విలువలు, సమానత్వం అన్నవి నచ్చని అంశాలు. అందుకనే పార్లమెంట్ నూతన భవనం ప్రారంభంలో సభ్యులకు ఇచ్చిన రాజ్యాంగ పుస్తకాల ప్రవేశికలో సెక్యులర్, సోషలిస్టు అన్న పదాలను తొలగించారు. ఎమర్జెన్సీలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాలను చేర్చారు కనుక ఆ పదాలను తాము తొలగించినట్లు వివరణ ఇచ్చారు. కాని వాస్తవం ఏమిటంటే ఆచరణలో రాజ్యాంగ మూల స్వభావాన్నే బిజెపి మార్చాలనుకొంటోంది. ప్రభుత్వాన్ని మతంతో కలగాపులగం చేస్తోంది. మత సామరస్యం కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడిన మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని అనధిóకారికంగా ఆకాశానికి ఎత్తుతోంది. గాంధీజీ హత్య కేసులో సరైన సాక్ష్యాలు లేక బయటపడిన సావర్కర్ విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రతిష్టించింది.
భారత పౌరులు ఏ మతాన్నయినా అనుసరించవచ్చు. ఏ మతాన్నయినా స్వీకరించవచ్చు. అది ప్రాథమిక హక్కు. అందుకు విరుద్ధంగా బిజెపి వారు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టాలు తెచ్చారు. మతాంతర వివాహాలకు లవ్ జిహాదీ సాకు చూపి అడ్డుపడి ప్రాథమిక హక్కును హరించివేస్తున్నారు. ఈ నేపథ్యంలో…భారత రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన, అనుసరించదల్చుకొన్న మౌలిక విలువలు ఏమిటి? నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరిస్తున్న విలువలేమిటి? ఒకసారి బేరీజు వేసుకోవాల్సిన రోజు ఇది.