రాజకీయంగా ఎదుర్కోలేక ఏలూరిపై కుట్ర

Jan 29,2024 00:16

– అర్హుల ఓట్ల తొలగింపు కుట్రలను తిప్పి కొట్టిన ఏలూరి
– నోవా అగ్రి గ్రూప్స్‌పై బురదల్లే కుట్ర
– కొండేపి ఎంఎల్‌ఎ డోలా బాల వీరాంజనేయ స్వామి
ప్రజాశక్తి – బాపట్ల జిల్లా
టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనపై బురద చల్లేందుకు వైసిపి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని కొండేపి ఎంఎల్‌ఎ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పర్చూరు నియోజకవర్గంలో గెలవలేమనే భయంతో ఏదో ఒక రకంగా సాంబశివరావు ప్రతిష్ట దిగజార్చాలనే కుట్రతో దిగజారుడు రాజకీయానికి ప్రభుత్వ పెద్దలు తెరలేపారని మండిపడ్డారు. ఏలూరిని ఎదుర్కొనే అభ్యర్థి దొరక్కపోవడం, ఏలూరిపై నిలబడే దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు లేకపోవడం వైసీపీకి శాపంగా మారిందని అన్నారు. దీంతో తాడేపల్లి పెద్దలు ఏలూరిని ఇబ్బందులకు గురి చేయాలనే లక్ష్యంతో అధికార దర్పాన్ని వినియోగించి కుట్రలకు దిగారని మండిపడ్డారు. 15ఏళ్ల క్రితం ఎమ్మెల్యే ఏలూరి నోవా అగ్రి గ్రూప్ సంస్థను స్థాపించారని, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ సంస్థ నుంచి బయటికి వచ్చారని తెలిపారు. పబ్లిక్ లిమిటెడ్ సంస్థగా పలువురు డైరెక్టర్ల ఆధీనంలో నడుస్తుందని అన్నారు. ఆ కంపెనీలో లోటుపాట్లు ఉంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. అక్రమ మార్గంలో గెలవాలనే తలంపుతో ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఏలూరి పోరాటం సాగించారనే కక్షతోనే కుట్రలు చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ పుట్టుకే విధ్వంసంతో ప్రారంభమైందని అన్నారు. అలాంటి ప్రభుత్వం నీతి, నిజాయితీగా ప్రజా సేవ చేస్తున్న ఎమ్మెల్యే ఏలూరిపై ఇలాంటి ప్రచారం చేయడం తగదన్నారు. నోవా గ్రూప్ సంస్థ ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్)లో అడుగు పెట్టిందనే కక్షతో అధికారం అడ్డం పెట్టుకొని దాడుల పేరుతో ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసిన ఎమ్మెల్యే ఏలూరి, టిడిపి విజయాన్ని ఆపలేరని పేర్కొన్నారు. సీఎం కార్యాలయం తాడేపల్లి నుంచి ఎమ్మెల్యే ఏలూరిపై కుట్రలకు డైరెక్షన్ చేస్తున్నారని, అవి పర్చూరులో సాగవన్నారు. గతంలో హెరిటేజ్ సంస్థలపై బురద చల్లిన ప్రభుత్వ పెద్దలు తాజాగా ఎమ్మెల్యే ఏలూరి స్థాపించిన సంస్థలపై బురద చల్లుతున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టే కుట్రలకు ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. ఎప్పటికైనా వైసీపీ పెద్దలు చీప్ పాలిటిక్స్ మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలన్నారు. రానున్న ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసిపి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని హెచ్చరించారు. పర్చూరు ప్రజల్లో ఎమ్మెల్యే ఏలూరిపై ఉన్న నమ్మకం, ప్రేమ, ఆప్యాయతలు చెరిపేందుకు చేస్తున్న కుట్రలు ఎన్నికల్లో పటాపంచలు అవుతాయని అన్నారు.

➡️