– పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు
ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్ స్టీల్ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా ఐక్య పోరాటాలు నిర్వహించనున్నట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి తెలిపారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి 1143వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ ఎఫ్ఎండి విభాగానికి చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును ప్రయివేటీకరించాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను అందరూ వ్యతిరేకించాలని కోరారు. స్టీల్ప్లాంట్ను నష్టాల వైపు నెడుతూ ఆర్థికంగా దెబ్బతీయాలని చూడటం దారుణమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎన్.రామారావు, వెంకటరావు, రాజు, డి.ఆదినారాయణ పాల్గొన్నారు.