- ఐదుగురు సభ్యులతో నియామకం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎస్సి వర్గీకరణపై ఐదుగురు సభ్యులతో కమిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నాయకత్వం వహించనున్న ఈ కమిటీలో కేంద్ర హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయశాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ నెల 22న ఈ కమిటీ తొలిసారి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మాదిగల వంటి షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలను పరిరక్షించడానికి, వారి వాటాకు అనుగుణంగా ప్రయోజనాలు పొందడం తదితర అంశాలపై తీసుకోగలిగిన పరిపాలనాపరమైన చర్యలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకారం తెలపడంతో కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.