నోటీసులిచ్చిన రుణ దాతలు
న్యూఢిల్లీ : కాఫీ డే ఎంటర్ప్రైజెస్ రుణాల చెల్లింపుల్లో మరోమారు విఫలం అయ్యింది. 2023 డిసెంబర్ త్రైమాసికంలో పలు అప్పులు చెల్లించలేకపోవడంతో మొత్తంగా రూ.434 కోట్ల రుణాలు డీఫాల్ట్ అయ్యింది. నగదు లభ్యత సమస్యల వల్ల రుణాల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని రెగ్యూలేటరీ సంస్థలకు కాఫీ డే సమాచారం ఇచ్చింది. బ్యాంక్లు, విత్త సంస్థల నుంచి పొందిన అప్పుల్లో గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో రూ.183.36 కోట్ల అసలు (ప్రిన్సిపల్ అమౌంట్) చెల్లించలేకపోయినట్లు వెల్లడించింది. మరోవైపు రూ.5.78 కోట్ల వడ్డీ చెల్లించడంలో కూడా విఫలం అయినట్లు తెలిపింది. 2023 డిసెంబర్ 31 నాటికి నాన్ కన్వర్టేబుల్ డిబెంచర్లు, నాన్ కన్వర్టేబుల్ రీడిమెబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ (ఎన్సిఆర్పిఎస్)లకు సంబంధించిన డెట్ సెక్యూరిటీలకు సంబంధించి రూ.200 కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉందని తెలిపింది. వీటికి సంబంధించిన రూ.44.77 కోట్ల వడ్డీలు చెల్లించడంలో విఫలం అయినట్లు తెలిపింది. వడ్డీ, అసలు తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో రుణదాతలు కంపెనీకి నోటీసులు పంపడం ద్వారా చట్టపరమైన చర్యలకు దిగారని తెలుస్తోంది. 2019 జులైలో కాఫీ డే వ్యవస్థాపకుడు, ఛైర్మన్ విజి సిద్ధార్థ మరణించిన తర్వాత ఆస్తుల విక్రయాల ద్వారా అప్పులను తీర్చడానికి ఆయన సతీమణి ప్రయత్నించింది. మార్చి 2020లో తన టెక్నాలజీ బిజినెస్ పార్క్ను విక్రయించడానికి బ్లాక్స్టోన్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 13 మంది రుణదాతలకు రూ.1,644 కోట్లను తిరిగి చెల్లించారు. అయినా ఇంకొన్ని అప్పులు అలాగే మిగిలి పోయి ఉన్నాయి.