బిగ్‌బాస్‌ విన్నర్‌-రన్నరప్‌ అభిమానుల మధ్య ఘర్షణ : ఆర్‌టిసి బస్సు ధ్వంసం

Dec 18,2023 12:54 #bigg boss, #Clash, #fans, #RTC BUS, #vandalized

హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ సీజన్‌-7 టైటిల్‌ను యూట్యూబర్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ గెలిచిన సంగతి విదితమే. రన్నరప్‌గా సీరియల్‌ నటుడు అమర్‌దీప్‌ నిలిచారు. అయితే పల్లవి ప్రశాంత్‌ – అమర్‌దీప్‌ అభిమానుల మధ్య ఘర్షణ రాజుకొని ఉద్రిక్తత ఏర్పడింది. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ఇరువురి అభిమానుల చర్యలపై సోషల్‌ మీడియాలో పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆటను ఆటగా చూడాలని కామెంట్లు పెడుతున్నారు.

‘బిగ్‌బాస్‌’ షూటింగ్‌ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు పెద్ద ఎత్తున అమర్‌, ప్రశాంత్‌ అభిమానులు చేరుకున్నారు. ప్రశాంత్‌ విజేత అని తెలియగానే అభిమానులంతా సంబరాలతో సందడి చేశారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్‌ – అమర్‌దీప్‌ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ దాడి చేసుకున్నారు. అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. అటుగా వెళుతున్న కొండాపూర్‌-సికింద్రాబాద్‌ ఆర్టీసీ బస్సుపై దాడి చేసి, అద్దాన్ని పగలగొట్టారు. ఇదిలా ఉండగా …. మరోవైపు బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వచ్చిన అమర్‌ దీప్‌ వాహనాన్ని వారంతా చుట్టుముట్టారు. ముందుకు కదలనీయకుండా దాడిచేసే ప్రయత్నం చేశారు. కారు అద్దాలను పగలగొట్టి, అమర్‌ను బయటకు దిగాలంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న అమర్‌ తల్లి, అతని భార్య భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. భద్రత మధ్య వారిని అక్కడి నుంచి తరలించారు.

➡️