ప్రజాశక్తి – జగ్గయ్యపేట: వైసిపి ప్రభుత్వంతోనే క్రైస్తవ్యానికి మనుగుడ సాధ్యమవుతుందని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. పట్టణంలోని కోదాడ రోడ్డు బి కన్వెన్షన్లో జగ్గయ్యపేట నియోజకవర్గ ఐక్య పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుధవారం పాస్టర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను వైసిపి క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు దయానంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ పోలే ముత్యం, స్టేట్ సెక్రటరీ భక్త పాల్, రీజనల్ కోఆర్డినేటర్ డేవిడ్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ క్రైస్తవ సోదరులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం వైసిపి ప్రభుత్వమేనని అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో అనేక గ్రామాలలో చర్చిల నిర్మాణానికి తన వంతు కషి చేస్తూ అండగా ఉంటున్నానని అన్నారు. గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి వ్యత్యాసం తెలుసుకోవాలని అలాగే నియోజకవర్గాన్ని అభివద్ధి చేసే సత్తా తమకే ఉందని మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య హయాంలో జరిగిన అభివద్ధికి ఈ ఐదేళ్ల కాలంలో తాను చేసిన అభివద్ధికి వ్యత్యాసాన్ని క్రైస్తవ సోదరులు తెలుసుకోవాలని అన్నారు.