ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి టిడిపిలో చేరారు. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆయన తన పదవికి, వైసిపికి రాజీనామా చేసి, మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను తన అనుచరులతో సహా కలుసుకుని, ఆయన సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. సిఎం జగన్ విధానాలు నచ్చక తాను పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. టిడిపి అధినేత చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర భవిష్యత్తు బాగుపడటమే కాకుండా, పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తారని నమ్మి టిడిపిలో చేరుతున్నట్లు వివరించారు. లోకేష్ మాట్లాడుతూ.. జగన్ అధికారంలోకి వచ్చాక పోలీసులు అన్ని విధాలా నష్టపోయారని, కొందరు ఉన్నతస్థాయి అధికారులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం వ్యవస్థను ఫణంగా పెట్టి జగన్కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.