ప్రజాశక్తి-అనంతపురం : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. గురువారం ఉదయం 9- 20 గంటలకు రాప్తాడు మండలం ప్రసన్నాయి పల్లె వద్దకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి పరిటాల సునీత, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి కే పార్థసారథి, యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ తదితరులు స్వాగతం పలికారు. ప్రసన్నయపల్లి నుంచి రోడ్ షో ద్వారా రాప్తాడుకు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో టిడిపి శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు నాశనమయ్యాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా మధ్యాహ్నం బుక్కరాయసముద్రం బహిరంగ సభలో ప్రసంగించునున్నారు. అనంతరం కదిరిలో సాయంత్రం నిర్వహించే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.