ఒట్టావా, న్యూఢిల్లీ : కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన 24 ఏళ్ల చిరాగ్ అంటిల్ వాంకోవర్ సిటీలో ఈ నెల 12 వతేదీ రాత్రి 11 గంటల సమయంలో కారులో వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. విద్యార్థి హత్యకు గురైన విషయాన్ని సౌత్ వాంకోవర్ పోలీసులు వెల్లడించారు.
‘కాల్పుల శబ్దం వినిపించినట్లు ఈస్ట్ 55 అవెన్యూ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి చూడగా.. కారులో చిరాగ్ మరణించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు’ అని వాంకోవర్ పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హర్యానాకు చెందిన చిరాగ్ 2022 సెప్టెంబరులో వాంకోవర్కు వచ్చారు. ఇటీవలే కెనడా వెస్ట్ యూనివర్శిటీ నుంచి ఎంబిఎ పూర్తి చేశారు. తాజాగా వర్క్ పర్మిట్ను సంపాదించారు. చిరాగ్ మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చేందుకు క్రౌడ్ఫండింగ్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.