- ముఖ్యమంత్రికి సిపిఎం డిమాండ్
- రాష్ట్ర కమిటీ తీర్మానం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నూటికి 97 శాతం హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ కార్మికులు, ఉద్యోగులకిచ్చిన హామీలను నెరవేర్చలేదని సిపిఎం విమర్శించింది. ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలు అమల్లోకి తెచ్చేందుకు తీసుకునే చర్యలపై ఈ అసెంబ్లీ సమావేశాలలోనే ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో ప్రారంభమైంది. పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబీ, బి.వి.రాఘవులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చేసిన తీర్మానాన్ని మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో మూడు లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలు, డైరెక్ట్ పేమెంట్, రెగ్యులరైజేషన్ అమలు జరగలేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, సమానపనికి సమాన వేతనం అమలుచేయాలని రాష్ట్ర కమిటీ డిమాండు చేసింది. వారంలో సిపిఎస్ను రద్దు చేసి ఓపిఎస్ను ఇస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోగా, జిపిఎస్ పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఒపిఎస్ను పునరుద్దరించి ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10,177 మందిని రెగ్యులర్ చేయడానికి ఉత్తర్వులు ఇచ్చినా ఇంకా అమలు కాలేదని పేర్కొంది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్, గ్రామ పంచాయితీ వంటి స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, టిటిడి, ప్రభుత్వ సొసైటీలు, ప్రభుత్వ పథకాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, డైలీవేజ్, కంటింజెంట్, మినిమం టైంస్కేల్ సమగ్రశిక్ష, నేషనల్ హెల్త్మిషన్, ఉపాధి హామీ, వెలుగు తదితర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనం అమలు చెయ్యకపోగా కనీసం మినిమం టైంస్కేల్ను కూడా అమలు చెయ్యలేదని, నెల నెలా కనీసం వేతనాలను కూడా రెగ్యులర్గా చెల్లించడం లేదని తెలిపారు. కనీసం హెచ్ఆర్ పాలసీని కూడా రూపొందించలేకపోయిందని పేర్కొంది. రాష్ట్రంలో 70 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో 50 లక్షల మంది కార్మికులకు ఒక్కరంగంలో కూడా కనీస వేతనాలు సవరణ జరగలేదని, చట్ట వ్యతిరేకంగా దారిమళ్లించిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను వెంటనే బోర్డుకు చెల్లించాలని, సంక్షేమ పథకాలు అమలు కొనసాగించాలని పేర్కొంది. నిలుపుదల చేసిన కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను కొనసాగిస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని, రాష్ట్రంలో హమాలీలు, ట్రాన్స్పోర్టు అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.