- అమ్మే హక్కు మోడీ సర్కార్కు లేదు
- స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జాతీయ సదస్సులో ఏచూరి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వైజాగ్ స్టీల్ ప్లాంట్పై పడగ విప్పిన ప్రయివేటు శక్తుల కంబంధ హస్తాల నుంచి పరిరక్షించుకోవాలంటే బిజెపిని ఓడించడమే మార్గమని సిపిఎం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నాడిక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్లో సదస్సు జరిగింది. సదస్సును ఉద్దేశించి ఏచూరి ప్రభృతులు ప్రసంగించారు. విశాఖ ఉక్కు దేశ సంపద అని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సంస్థకి ఒక నిర్వాహకుడే మినహా దానిని ప్రయివేటుకు అమ్మేసే హక్కు ఆయనకు లేదని ఏచూరి అన్నారు. దేశ ప్రజలే విశాఖ ఉక్కుకు యజమానులు అని, ప్రజల సమ్మతి లేకుండా దేశ సంపదని అమ్మే హక్కు కేంద్రానికి లేదని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటే 2024 ఎన్నికల్లో మోడీని గద్దించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించకపోతే విశాఖ ఉక్కుతో పాటు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కూడా పరిరక్షించుకోలేమని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు స్థాపన కోసం కేంద్రం రూ.ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే, కార్మిక వర్గం దాని సంపదను రూ.మూడు లక్షల కోట్లకు పెంచిందని, శ్రమజీవులు సృష్టించిన ఈ సంపదంతా ప్రజల ఆస్తేనని, దాన్ని అదానీ, అంబానీల ఆస్తిగా మార్చాలని జూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటానికి మద్దతివ్వడంలో తమ పార్టీ ముందుందని, ఇక ముందు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు.
సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారని విమర్శించారు. దీనిని ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాజేష్ నిలోతియా మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు.
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ను రూ.లక్ష కోట్లతో విస్తరణకు ప్రభుత్వం యోచిస్తోందని, అయితే విస్తరించే బదులు, సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్ జిత్ కౌర్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల పోరాటం కొనసాగుతోందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ ఎంపిలు పార్లమెంట్లో లేవనెత్తాలని డిమాండ్ చేశారు. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని, వచ్చే ఎన్నికల్లో బిజెపికి తగిన బుద్ధి చెబుతామన్నారు. సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, అసలు మోడీ ప్రభుత్వం ఎందుకు అమ్మాలని చూస్తోందో అర్థం కావటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జాతీయ కార్యదర్శి సుదీప్ దత్, ఎఐటియుసి జాతీయ కార్యదర్శి సచ్నాజ్ రఫీక్, వైజాగ్ ఎంపి ఎంవివి సత్యనారాయణ, ఐద్వా కోశాధికారి ఎస్.పుణ్యవతి, ఆప్ నేత మణి నాయుడు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు డి ఆదినారాయణ, ఎం.రాజశేఖర్, జె అయోధ్యరాము తదితరులు పాల్గొన్నారు.