సిపిఐ(ఎంఎల్) నాయకులు పెద్దన్న మృతి – పలువురి సంతాపం

Jan 15,2024 07:48 #CPIML, #passed away

ప్రజాశక్తి – అనంతపురం :సిపిఐ ఎంఎల్‌ అనంతపురం జిల్లా కార్యదర్శి పెద్దన్న (76) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. డిగ్రీ వరకు చదివిన ఆయన వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా చేరారు. 1998లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. తరిమెల నాగిరెడ్డి ప్రభావంతో విద్యార్థి దశ నుంచి ఉద్యమంలో పాల్గంటూ వచ్చారు. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తూ యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) పార్టీలో చేరారు. ఈ ఉద్యమాల్లో ఉంటూనే ఎన్‌జిఒ సంఘం నాయకుడు గానూ పనిచేశారు. అనంతరం ఆ పార్టీ సిపిఐ ఎంఎల్‌గా రూపాంతరం చెందడంతో సిపిఐ ఎంఎల్‌ జిల్లా కార్యదర్శిగానూ, రాష్ట్ర నాయకులుగానూ పనిచేశారు. గత కొంత కాలంగా వయోభారంతో భాదపడుతున్నా.. అంగన్‌వాడీ కార్మికుల సమ్మెలోనూ పాల్గని మద్దతు తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, రాష్ట్ర నాయకులు జి.ఓబులు, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసి నాయకులు ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్‌ఎం.బాషా, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు.

cpiml leader peddanna passed away a

➡️