సందేశ్‌కాలీ వెళ్లకుండా సిపిఎం నేతలను అడ్డుకున్న పోలీసులు

Feb 20,2024 15:05 #Brinda Karat, #cpm leader

 కోల్‌కతా :    వివాదాస్పద సందేశ్‌కాలీకి వెళ్లకుండా మంగళవారం సిపిఎం సీనియర్‌ నేత బృందాకారత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌కాలీకి వెళ్లే మార్గంలోని ధమఖలి ఫెర్రీ ఘాట్‌లో బృందాకారత్‌ సహా పలువురు నేతలను పోలీసులు నిలిపివేశారు. స్థానిక తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) నేత, రేషన్‌ బియ్యం స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్‌ షాజహాన్‌ స్థానిక మహిళల భూములను కబ్జా చేయడంతోపాటు లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే.

మహిళలను స్థానిక టిఎంసి కార్యాలయాలకు పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడినపుడు శాంతికి విఘాతం కలిగిందని, ఇప్పుడు తాము న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని బృందాకారత్‌ పేర్కొన్నారు. తమ పర్యటనతో సందేశ్‌ఖాలీలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఓ పోలీస్‌ అధికారి చెప్పారని అన్నారు. సందేశ్‌ కాలి వెళ్లకుండా తమని అడ్డుకోవడం సరికాదని, ఈ చర్యను ఖండిస్తున్నామని అన్నారు.  సందేశ్‌కాలీలో జరిగిన ఘటన అనాగరికమని మండిపడ్డారు.

గత నెల 5న రేషన్‌ బియ్యం స్కాం కేసులో విచారణ కోసం టిఎంసి నేత షాజహాన్‌ నివాసానికి వెళుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులపై కొందరు దుండుగులు దాడికి దిగారు. అప్పటి నుండి షాజహాన్‌ పరారీలో ఉన్నారు.

➡️