విజయవాడలో మహాధర్నాను జయప్రదం చేయండి

Nov 24,2023 14:58 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడలో నిర్వహించ తలపెట్టిన మహా ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద వి ఆర్ ఏ లతో కలిసి మహాధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రవికుమార్ మాట్లాడుతూ రైతులు, పేదలు, కార్మికులు, సామాన్య ప్రజల సమస్త ప్రయోజనాలను నరేంద్ర మోడి ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులలోని లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు ఉదారంగా అందజేస్తూ ఈ 9 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ పేరుతో రుణమాఫీ చేసిందని చెప్పారు. వ్యవసాయ సంక్షోభం ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల రుణాలు మాఫీ చేయడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. కార్పొరేట్ కంపెనీల రుణాలు మాఫీ చేయడం కాదని, రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓడరేవులు, ఎయిర్ పోర్టులు, విద్యుత్ సంస్థలు, రైల్వే, బొగ్గు గనులు, చివరకు ఆదివాసి, గిరిజనుల అటవీ భూములపై హక్కులను హరిస్తూ తాజాగా అటవీ చట్టానికి సవరణ పాస్ చేసిందని విమర్శించారు. ఈ చర్యలన్నీ కార్పొరేట్లకు ప్రత్యేకంగా మోడి మానస పుత్రుడు గౌతమ్ అదానీని ప్రపంచ కుబేరులలో మొదటి స్థానానికి చేర్చేందుకు దోహదపడ్డాయన్నారు. సామాన్య ప్రజలపైన పన్నుల భారాన్ని పెంచుతూ, కార్పొరేట్లకు ఐ.టి, ఎక్సైజ్, కస్టమ్స్, కార్పొరేట్ ట్యాక్స్ ల పైన లక్షలాది కోట్ల రూపాయల రాయితీలను ఇస్తున్నదని అన్నారు. మరోవైపు కార్మికుల హక్కులను హరిస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందన్నారు. ఫలితంగా బలహీన వర్గాల ప్రజల ఉపాధికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు లాభాలు పెంచి ప్రజల సంపదలు లూటీ చేస్తున్న కార్పొరేట్లను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి ఆర్ ఏ లు పెంచలయ్య, సుబ్బారాయుడు, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️