ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యాంలో జరిగే చలో ఢిల్లీ కార్యక్రమానికి సంఘీభావంగా జిల్లా, మండల కేంద్రాల్లో గురువారం పెద్దయెత్తున ధర్నాలు చేపట్టనున్నాయని, కార్మికవర్గం ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సిఐటియు రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్ నరసింగరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతాంగానికి కేంద్రం రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. అలాగే కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని వివరించారు. కార్మికుల, రైతులు హక్కులు కాలరాస్తోందని, గిట్టుబాటు ధరకు మద్దతు కల్పించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో కార్మికవర్గంలోని అనేక రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 14న జరిగే ధర్నాలో అందరూ పాల్గొనాలని వారు కోరారు.