న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని వెనక్కి తీసుకోబోమని, కచ్చితంగా అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. గురువారం ఓ మీడియా ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం అమలుకు మైనారిటీలు లేదా ఇతర వర్గాలు భయపడవద్దని, ఎవరి పౌరసత్వాన్నీ తీసివేయడానికి చట్టంలో ఎటువంటి నిబంధన లేదని అన్నారు.
సిఎఎ ఎప్పటికీ వుపసంహరించబడదని, దేశంలో భారత పౌరసత్వాన్ని పొందడమనేది ప్రభుత్వ సార్వభౌమ నిర్ణయమని, దాని మేము ఎప్పటికీ రాజీపడము. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీ శరణార్థులకు హక్కులు, పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే సిఎఎ అని అమిత్షా అన్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడంలో విఫలం కాలేవు. ఇది కేంద్ర ప్రభుత్వ సమస్య అని, ప్రతిపక్షాలు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని అమిత్షా అన్నారు.