కన్నతల్లిని కత్తితో పొడిచిన కసాయి కొడుకు

Apr 20,2024 11:40 #crime, #nandigama

నందిగామ : తల్లిని మించిన దైవం లేదంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే తల్లిని మించి ఎవరూ లేరని అర్ధం. నవమాసాలు మోసి కనిపెంచి కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే తల్లి మనసు కల్మషం లేనిది. కానీ అలాంటి అమ్మను ఎవరైనా చంపాలనుకుంటారా? ఊహించుకోవడానికే మనసు దీనికి ఒప్పుకోదు. కడుపులో నవమాసాలు మోసిన కన్నతల్లి కడుపులోనే కత్తి దించాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో చోటుచేసుకుంది.
ఐతవరం గ్రామంలో కన్నతల్లిని కత్తితో పొడిచాడు కసాయి కొడుకు మాగంటి నరేష్‌. ఈ ఘటనలో తల్లి మాగంటి ఉమమహేశ్వరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నందిగామ పోలీసులు విచారణ చేపట్టారు. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకును తల్లి మందలించడమే ఆమె చేసిన తప్పు. చెడు వ్యసనాలు మానాలని కొడుకును తరచూ మందిలించేంది. వీరి ఇరువురి మధ్య ఈ విషయంలో తరచూ ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ఆస్తి పంపకాలు చేయమని కొడుకు అడిగాడు. తల్లి నిరాకరించి కోర్టు నుంచి కొడుకుకు నోటీసు పంపించడంతో కొడుకు తల్లిపై కత్తితో దాడి చేశాడు.

➡️