పంట కాలువలో ఆర్‌టిసి బస్సు బోల్తా -ఇద్దరు మృతి

Dec 20,2023 20:55 #Eluru district, #road accident
bus accident

ప్రజాశక్తి- మండవల్లి/కైకలూరు(ఏలూరు జిల్లా): ఆర్‌టిసి బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢకొీట్టి ఆ పక్కనే ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం కాకతీయ నగర్‌ వద్ద బుధవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు, బస్సు ప్రయాణికుల కథనం ప్రకారం… ఏలూరు డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు సుమారు 65 మంది ప్రయాణికులతో ఏలూరు నుంచి నరసాపురానికి ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌గా బయలుదేరింది. కైకలూరు శివారులో మండవల్లి మండలం కాకతీయనగర్‌ వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్‌ టేక్‌ చేస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢకొీంది. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ఈ సంఘటనలో కాకతీయ నగర్‌కు చెందిన మోటార్‌ సైకిలిస్ట్‌ కేతా అర్జున్‌రావు (60) అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు చక్రాల కింద నలిగి ఆయన దేహం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బిగ్గరగా కేకలువేస్తూ వణికిపోయారు. బస్సులో ఉన్న మండవల్లి మండలం భైరవపట్నం గ్రామానికి చెందిన చింతాడ శ్రీదేవి (50) ఊపిరాడక మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రయాణికులు ప్రాణభయంతో బస్సు అద్దాలను పగలగొట్టుకుని బయటకు వచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్‌ సాయంతో బస్సును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

➡️