- వందమందికిపైగా మృతి,
- 141 మందికి గాయాలు
టెహరాన్ : ఇరాన్ సైనిక ఉన్నతాధికారి సంస్మరణ కార్యక్రమంలో సంభవించిన జంట పేలుళ్ళలో వంద మందికిపైగా మరణించారు. మరో 141మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. ఇరాన్ ఆర్మీ జనరల్ ఖాసిం సోలెమని వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి సమీపంలో బుధవారం జరిగిన సంస్మరణ కార్యక్రమంలో పెద్ద పేలుడు సంభవించింది. ఆ తరువాత కొద్ది నిముషాల వ్యవధిలోనే రెండో పేలుడు చోటుచేసుకుంది. పేలుళ్ళకు కారకులెవరనేది వెంటనే తెలియరాలేదు. పేలుళ్ళతో ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరగడంతో అనేకమంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ టివి తెలిపింది. సైనిక ఉన్నతాధికారి సోలెమని నాలుగవ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వేలాదిమంది అభిమానులు పాల్గన్నట్లు టివి విజువల్స్బట్టి తెలుస్తోంది. సౌత్ సెంట్రల్ నగరమైన కెర్మన్లో 15నిముషాల వ్యవధిలో ఈ పేలుళ్లు సంభవించాయి. 2020 జనవరి 3న బాగ్దాద్ విమానాశ్రయానికి వెలుపల అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఖాసిం సోలెమని చనిపోయిన సంగతి తెలిసిందే.. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ విదేశీ కార్యకలాపాల విభాగమైన ఖుద్స్ ఫోర్స్కు ఆయన నాయకత్వం వహించారు. ఆయన హత్య నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదముందని పరిశీలకులు పేర్కొంటున్నారు.