పాత పెన్షన్‌పై సిఎం హామీ అమలు చేయాలి

Feb 18,2024 20:15 #CPM AP, #V.Srinivas rao

సిపిఎస్‌ ఉద్యోగుల నిర్బంధం సరికాదు

సిపిఎం రాష్ట్ర కమిటీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :పాత పెన్షన్‌ విధానం పునరుద్దరిస్తాననే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని ఎపిసిపిఎస్‌ ఉద్యోగులు ఛలో విజయవాడ రాకుండా ఎక్కడికక్కడ నిర్భంధించటాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ చర్యలతో ప్రభుత్వ నిరంకుశ వైఖరి మరోసారి బహిర్గతమయిందని పేర్కొంది. సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఎపిసిపిఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ పిలుపిచ్చిన చలో విజయవాడ భగ్నం చేసి, ఉద్యోగులను రానీయకుండా నిర్భంధించడం గర్హనీయమని పేర్కొన్నారు. చర్చలకని పిలిచి అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాటి అయిందని, ఈ విధంగా ఉద్యోగుల కనీస ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యోగులు శుభకార్యాలకు కూడా మండలం దాటి వెళ్లనీయక ఇంటివద్ద, కార్యాలయాల వద్ద పహారా కాయడం అప్రజాస్వామికమని తెలిపారు. సిపిఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడను రద్దు చేసుకునేట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని, రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఖండించాలని కోరారు.

➡️