న్యూఢిల్లీ : పంటకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లకు చట్టబద్ధమైన హామీ కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు అన్ని సరిహద్దుల్లోనూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు మెట్రో సేవలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు. నొయిడా – గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వే మీదుగా యమునా ఎక్స్ప్రెస్ వే టు ఢిల్లీ, అలాగే సిర్సా నుండి సూరజ్పూర్ టు పారి చౌక్ మార్గాలలో వెళ్లే అన్ని రకాల గూడ్స్ వాహనాలపై ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. వేరే మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు.