ప్రజాశక్తి – సీతంపేట : స్థానిక ఐటిడిఎ కొత్త ప్రాజెక్టు అధికారిగా, పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా ఎస్హెచ్ శుభం బన్సల్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన పిఒ కల్పనా కుమారి ఆకస్మిక బదిలీ కావడంతో జెసి సోబిక నుంచి బాధ్యతలు స్వీకరించారు. బన్సల్ శాప్ ఎండిగా పనిచేస్తూ ఎక్కడికి బదిలీపై వచ్చారు. 2019 ఐఎఎస్ బ్యాచ్కు చెందినవారు ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం పాలకొండ నియోజకవర్గ పరిధిలోని తహశీల్దార్లు, ఎంపిడిఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం నామినేషన్ల పరిశీలనకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ, తహశీల్దార్లు మహేశ్వరరావు, ఎంపిడిఒ కె.గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.