హోచిమిన్ సిటీ : బ్యాంక్ను మోసం చేసిన కేసులో నేరం రుజువుకావడంతో వియత్నాంలో ఒక మహిళా వ్యాపారవేత్తకు ఉరిశిక్ష విధించారు. సైగాన్ కమర్షియల్ బ్యాంక్ (ఎస్సిబి)ను మహిళా వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్ ఒక దశాబ్దం పాటు మోసగించారని, సుమారు 12.5 బిలియన్ అమెరికా డాలర్లను బ్యాంక్ నుంచి కాజేశారని కేసు నమోదైంది. 2022 ఆక్టోబరులోనే లాన్ను అరెస్టు చేశారు. కుంభకోణం విలువ 27 బిలియన్ అమెరికా డాలర్లుగా ప్రాసిక్యూషన్ అంచనా వేసింది. ఇది వియత్నం గత ఏడాది జిడిపిలో ఆరు శాతానికి సమానంగా తెలిపింది. స్కాంను కప్పిపుచ్చడానికి వివిధ స్థాయి అధికారులకు 5.2 మిలియన్ల డాలర్లు లంచంగా ఇచ్చారని లాన్పై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసును ఐదు వారాలపాటు ఐదుగురు జడ్జీలు ఉన్న ధర్మాసనం విచారించింది. గురువారం తీర్పును వెల్లడించింది.