ఫైబర్‌ నెట్‌ కేసులో సుప్రీంకోర్టు విచారణ వాయిదా

Jan 17,2024 21:35 #Case, #CJI, #Nara Chandrababu

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఫైబర్‌ నెట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు బుధవారం విచారణకు రాగా, ధర్మాసనం కూర్చోవడం లేదని, అందువల్ల మరో రోజు విచారణ చేపడుతామని, తేదీని వెల్లడిస్తామని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ వెల్లడించారు. ఫైబర్‌ నెట్‌ కేసులో తన సన్నిహితులకు కాంట్రాక్ట్‌ ఇచ్చారని, ఈ వ్యవహారంలో రూ.వందల కోట్ల మేర కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో చంద్రబాబు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా..ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ అనిరుద్ద బోస్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదీతో కూడిన ధర్మాసనం విచారణ జరపవలసి ఉండగా, విచారణను వాయిదా వేసింది.

➡️