ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ముగ్గురూ ప్రధాని మోడీ భజనపరులేనని ఎపిసిసి మీడియా కమిటీ చైర్మన్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. విశాఖ విజెఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీలేదని తెలిపారు. విశాఖ రైల్వే జోన్, కాకినాడ పెట్రోలియం కారిడార్, కడప ఉక్కు కర్మాగారం, పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులను కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ప్రత్యేక హోదాను విస్మరించిందని విమర్శించారు. వైసిపి, టిడిపి రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి మోడీ కీర్తనతో కాలక్షేపం చేస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుణాంధ్రప్రదేశ్గా మార్చేశారని అన్నారు. ల్యాండ్ మాఫియా, ఎర్రచందనం, మట్టి మాఫియాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందని, స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యాన జరిగిన సభకు విశేష ఆదరణ దక్కిందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్తల శ్రీరామమూర్తి, అధికార ప్రతినిధి జి వెంకటరావు, ఎబిఎన్ వర్మ, కుమార్ రెడ్డి, రాములు పాల్గొన్నారు.