చెన్నై : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తమిళనాడులో నగదు ప్రవాహానికి దారులు తెరుస్తున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్లో బిజెపి కార్యకర్త సహా ముగ్గురు వ్యక్తులు రూ.4 కోట్ల నగదుతో పట్టుబడ్డారు. స్వాధీనం చేసుకున్న నగదును తదుపరి విచారణ నిమిత్తం ఆదాయపు పన్ను (ఐటి) శాఖకు పంపినట్టు చెంగల్పట్టు జిల్లా ఎన్నికల అధికారి (డిఇఒ) తెలిపారు. నిందితులు బిజెపి సభ్యుడు, ప్రయివేట్ హౌటల్ మేనేజర్ సతీష్, అతని సోదరుడు నవీన్, ఒక డ్రైవర్ పెరుమాళ్ ఆరు బ్యాగుల్లో 4 కోట్ల రూపాయలను తీసుకువెళుతున్నారు. ఈ ముగ్గురూ రైలులో తిరునల్వేలికి వెళ్లాల్సి ఉండగా ఫ్లయింగ్ స్క్వాడ్ వారిని అదుపులోకి తీసుకున్నది. తిరునెల్వేలి బిజెపి ఎంపీ అభ్యర్థి నైనార్ నాగెంతిరన్ బృందం సూచనల మేరకు సతీష్ పనిచేసినట్టు ప్రాథమికంగా అంగీకరించారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. 39 లోక్సభ స్థానాలున్న తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనున్నది. దీనికి కొన్ని రోజుల ముందే ఈ పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం.