ఇసిని శాసించేలా బిజెపి అధ్యక్షురాలు

Apr 6,2024 23:42 #cpm v srinivasarao, #prakatana

-ఐపిఎస్‌ బదిలీల లేఖను ఖండించిన సిపిఎం రాష్ట్ర కమిటీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో  :కీలక స్థానాల్లో ఉన్న 22 మంది ఐపిఎస్‌లను బదిలీ చేసి వారి స్థానంలో ఎవర్ని నియమించాలో కూడా పేర్లను సూచిస్తూ ఎన్నికల కమిషన్‌కు బిజెపి లేఖ రాయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ విధంగా రాజ్యంగ వ్యవస్థలను బ్లాక్‌మెయిల్‌ చేయడాన్ని తాము ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు .రాజ్యాంగబద్దంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్‌ను శాసించేలా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు లేఖ రాయడం గర్హనీయమని పేర్కొన్నారు. ఇది ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను దెబ్బతీయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తూ వారి స్థానంలో ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ లేఖ రాయడం అనుచితమని పేర్కొన్నారు. ఒక రకంగా అనధికార సిఫార్సు చేయడమేనని తెలిపారు. ఈ లేఖల ఎన్నికలు సజావుగా జరగాలన్న ఆలోచన కన్నా దురుద్దేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇప్పటికే సిబిఐ, ఇడి, ఐటి వంటి సంస్థలను ప్రతిపక్ష నాయకులపై ఉసిగొల్పి దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే దారిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని లేఖ రాయడం, అధికార దురహంకారంతో శాసించే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఇలాంటి అప్రజాస్వామ్యామిక చర్యలను చైతన్యవంతమైన రాష్ట్రప్రజలు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు.

➡️