అనకాపల్లి : అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి బిజెపి తరఫున పోటీ చేస్తున్న సిఎం రమేష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఒక కేసుకు సంబంధించి తనిఖీలు చేస్తున్న డిఆర్ఎ అధికారులపై సిఎం రమేష్ దాడికి దిగడమే కాకుండా వారి విధులకు ఆటంకం కలిగించారు. మరోవైపు ఎలక్షన్ కోడ్ అమలవుతోన్న నేపథ్యంలో … బిజెపి కమలం గుర్తు ఉన్న చీరలను కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఇదేంటీ అని పరిశీలించిన అధికారులపై రంకెలేసి కన్నెర్ర చేశారు.
అనకాపల్లి జిల్లా చోడవరంలో జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్లో డిఆర్ఐ అధికారులు సోదాలు చేపట్టారు. డిఆర్ఎ అధికారులపై దాడికి దిగడమే కాకుండా, విధులకు ఆటంకం కలిగించిన కారణంగా … సిఎం రమేష్కు శనివారం రాత్రి పోటీసులు 41ఏ నోటీసులిచ్చారు. ఈ క్రమంలో ఈనెల తొమ్మిదో తేదీన విచారణను హాజరు కావాలని అనకాపల్లి ఎస్డీపీవో ఆదేశించారు. కాగా, ఐపీసీలోని 353,342,506,201,188, 143/ఆర్డబ్ల్యు, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సిఎం రమేష్, చోడవరం టిడిపి అభ్యర్థి రాజు సహా ఆరుగురి పేర్లను పోలీసుల ఎఫ్ఐఆర్లో చేర్చారు.
ఇదిలాఉండగా … గత శనివారం నర్సీపట్నంలో కృష్ణా ప్యాలెస్లో బిజెపి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు బిజెపి కమలం గుర్తు ఉన్న చీరల పంపిణీ కార్యక్రమం వివాదానికి తెరలేపింది. విషయం తెలుసుకున్న నర్సీపట్నం టౌన్ సిఐ క్రాంతి కుమార్, మున్సిపల్ కమిషనర్ రవిబాబుతో పాటు ఎన్నికల యంత్రాంగం అక్కడికి చేరుకుని పరిశీలించడంతో … సిఎం రమేష్ అధికారులపై రంకెలేశారు. ఓటర్లుకు సింబల్ తెలియజేయడానికి కమలం గుర్తు కలిగిన చీరలు ఇవ్వడం తప్పా ? అని అధికారులను ప్రశ్నించారు. ఇవి తాయిలాలు కాదని అధికారులపైనే కన్నెర్ర చేశారు.