ఆధార్‌తో ఆస్తుల అనుసంధానం

Dec 22,2023 10:30 #Aadhar Card
assets link with adhaar card

మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి

కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయంపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దేశంలో ప్రతీ ఒక్కరి ఆస్తులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ నిర్వహించింది. ఈ విచారణలోనే కేంద్రానికి ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. అలాగే, పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలను విజ్ఞాపనగా తీసుకోవాలని కేంద్రానికి కోర్టు సూచించింది. అయితే, అవినీతి, నల్లధనం ఉత్పత్తి, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల చర, స్థిరాస్తి పత్రాలను వారి ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు. దీంతో, జస్టిస్‌ రాజీవ్‌ శక్ధేర్‌, జస్టిస్‌ గిరీష్‌ కత్పాలియాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ కేంద్రాన్ని పైవిధంగా ఆదేశించింది.

➡️