” త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కెసిఆర్‌ను కోరా ” : సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : ” త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కెసిఆర్‌ను కోరా ” అని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో కెసిఆర్‌ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న వైద్యులు శనివారం వాకర్‌ సాయంతో నెమ్మదిగా అడుగులు వేయించారు. ఈ నేపథ్యంలో … ఆదివారం ఉదయం హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఉన్న బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ను సిఎం రేవంత్‌ పరామర్శించారు. మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీతో కలిసి ఆస్పత్రికి వెళ్లిన రేవంత్‌.. కెసిఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రి కెటిఆర్‌, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో సిఎం మాట్లాడారు. కెసిఆర్‌ను పరామర్శించాననీ.. క్రమంగా కోలుకుంటున్నారనీ చెప్పారు. ఆయన వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్‌ను ఆదేశించానన్నారు. కెసిఆర్‌ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. మంచి ప్రభుత్వ పాలన అందించడానికి ఆయన సూచనలు అవసరం ఉందని తెలిపారు. ప్రజల పక్షాన అసెంబ్లీలో కెసిఆర్‌ మాట్లాడాల్సిన అవసరముందని, త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కెసిఆర్‌ను కోరానని రేవంత్‌ చెప్పారు.

➡️