న్యూఢిల్లీ : దేశంలో పేదలు-ముస్లింలు లేకుండా చేయడమే బిజెపి లక్ష్యమని …. సిఎఎను ఇప్పుడెందుకు అమలు చేస్తున్నారో చెప్పాలని పౌరసత్వ సవరణ చట్టం పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సిఎఎను ఎన్పిఆర్, ఎన్ఆర్సిలతో కలిపి చూడాలని అప్పుడే దాన్ని సరిగ్గా అర్ధం చేసుకోగలమన్నారు. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన తీరు ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కామెంట్స్.. సిఎఎ పై కేంద్రం తీరు ఏంటో స్పష్టంగా తెలిసిపోతుందని చెప్పారు. ఈ దేశంలో పేదలు, దళితులు, మైనారిటీలు, ముస్లింలకు చోటు లేకుండా చేయడమే సిఎఎ, ఎన్పిఆర్, ఎన్ఆర్సి లక్ష్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, ఎన్నికలు రాగానే సిఎఎ నిబంధనలు వస్తాయని బిజెపి పై ధ్వజమెత్తారు. పౌరసత్వ సవరణ చట్టంపై తమకు అభ్యంతరాలున్నాయని, మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి అసదుద్దీన్ సూచించారు. ఈ సిఎఎ నిబంధనలను గత ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్లో పెట్టారని ప్రశ్నించారు. సిఎఎ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో మోడీ సర్కార్ చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలే లక్ష్యంగా సిఎఎ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ తెచ్చారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.