ఆర్టికల్ 370ని రద్దు చేయాలని మొదటి నుండి బిజెపి డిమాండ్ చేస్తోంది. దాని లక్ష్యం కాశ్మీరీల ప్రయోజనం కాదు. మత విద్వేషాలను రెచ్చటొట్టే ప్రక్రియలో భాగంగా 370 ఆర్టికల్ను రద్దు చేయడంతో పాటు జమ్ము కాశ్మీర్ లోని లడఖ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మోడీ ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ముస్లిం విద్వేషం సృష్టించి మెజారిటీ హిందూ ఓట్లు పొందడం బిజెపి కి ప్రధానం. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో బిజెపి చెప్పుల్లో తన కాళ్లు దూర్చి హిందువుల ఓట్లు రాబట్టుకోవాలని తహతహలాడుతోంది.
ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస ్పదంగా మారింది. న్యాయకోవిదులు, మేధావులు సుప్రీం తీర్పు వల్ల కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో మున్ముందు అవాంఛనీయ పరిణామాలు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంపై పట్టు కలిగిన న్యాయవాదిగా పేరున్న ఫాలి నారిమన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకుర్ వంటి వారు 370 ఆర్టికల్ రద్దు చెల్లదన్నారు. కాని చిత్రం ఏమిటంటే ఆర్టికల్ 370 రద్దు చేయరాదని డిమాండ్ చేస్తూ వచ్చిన ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కప్పదాటు వేస్తోంది. ఆర్టికల్ 370 రద్దుతో కాంగ్రెస్ ఏకీభవిస్తూనే, దాన్ని అమలు చేసిన పద్ధతి బాగాలేదని గోడమీది పిల్లి వాటంగా చెప్పింది. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని మొదటి నుండి బిజెపి డిమాండ్ చేస్తోంది. దాని లక్ష్యం కాశ్మీరీల ప్రయోజనం కాదు. మత విద్వేషాలను రెచ్చటొట్టే ప్రక్రియలో భాగంగా 370 ఆర్టికల్ను రద్దు చేయడంతో పాటు జమ్ము కాశ్మీర్ లోని లడఖ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మోడీ ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ముస్లిం విద్వేషం సృష్టించి మెజారిటీ హిందూ ఓట్లు పొందడం బిజెపి కి ప్రధానం. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో బిజెపి చెప్పుల్లో తన కాళ్లు దూర్చి హిందువుల ఓట్లు రాబట్టుకోవాలని తహతహలాడుతోంది. బిజెపి మతతత్వ విధానాలు మన రాజ్యాంగ విలువలకు, స్వాతంత్య్రోద్యమ విలువలకు విరుద్ధమైనవి. ఈ విషయం ప్రజల ముందు వివరించి బిజెపి రాజకీయాలను ఎండగట్టాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దానికి విరుద్ధంగా మతతత్వ ఎజెండాలో బిజెపి తో పోటీ పడాలని భావిస్తోంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల తర్వాతయినా కాంగ్రెస్ సోయి లోకి రాలేదు.
సుప్రీం తీర్పుపై సిపిఐ(ఎం) ఘాటుగా స్పందించింది. ”ఈ తీర్పుతో సుప్రీం కోర్టు తేనెటీగల తుట్టెను కదిపింది. రాష్ట్ర శాసన సభ అభిప్రాయానికి బదులు గవర్నర్ అభిప్రాయాన్ని తీసుకొంటే చాలని, తద్వారా రాష్ట్రాల సరిహద్దులు కూడా మార్చుతూ రాష్ట్ర విభజన చేయవచ్చని సుప్రీం చెప్పినట్లయింది. సమైక్యత పేరుతో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడానికే తీర్పు దోహదపడ్తోంది”. అని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హెచ్చరించారు. దీనివల్ల రాజ్యాంగంలోని సమాఖ్యత త్వానికి విఘాతం కలుగుతుందని సిపిఐ(ఎం) హెచ్చరించింది.
సిపిఐ కూడా ఇదే తరహా స్పందనను వ్యక్తం చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఒక ప్రకటన చేస్తూ సుప్రీం తీర్పును ప్రశ్నించారు. ”బిజెపి ప్రభుత్వం చాలా హడావిడిగా జమ్ముకాశ్మీర్ ప్రజలను సంప్రదించకుండా ఆ రాష్ట్రంపై నిర్ణయం చేసింది. బిజెపి చూపిన మొండితనం దాని నియంతృత్వ ధోరణికి గుర్తు అని ఆయన విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దులోని చట్టబద్దతపై చెప్పిన తీర్పులో సుప్రీం అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటేసిందని, తాజా సుప్రీం తీర్పు సమాఖ్య వ్యవస్థకు పెద్ద విఘాతమని డిఎంకె విమర్శించింది. శివసేన సుప్రీం తీర్పును ఆహ్వానించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా విలీనం చేసి గ్రేటర్ కాశ్మీర్కు ఎన్నికలు జరపాలని ఉద్ధవ్ థాకరే చెప్పారు. విలీనం తర్వాత ఎన్నికలు జరగడమంటే ఇక ఇప్పట్లో కాశ్మీర్ ఎన్నికలు లేనట్లే.
మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం… అభిషేక్ సింఘ్వీతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దును వెనకేసుకొచ్చారు. రద్దు చేసిన విధానంపైన మాత్రమే తాము సుప్రీం కోర్టుతో విబేధిస్తున్నామని చెప్పారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఆర్టికల్ 370 రద్దుపై మౌనం వహించడం గమనార్హం.
‘ఇండియా’ కూటమిలో భాగస్వాములైన నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సి), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) సుప్రీం తీర్పుతో గట్టిగా విబేధించాయి. పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సుప్రీం తీర్పును ‘మరణ శాసనంగా అభివర్ణించారు. జమ్ము కాశ్మీర్కు మాత్రమే కాదు భారతదేశం అన్న అవగాహనకు కూడా తీర్పువల్ల విఘాతం కలిగిందన్నారు. కాగా నేషనల్ కాన్ఫరెన్సు నాయకుడు ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఒప్పించడంలో తాము విఫల మైనందుకు జమ్ము కాశ్మీర్ ప్రజలు తమను క్షమించాలి అని, 2019 ఆగస్టు 5న 370ని రద్దు చేస్తూ మన నుండి లాక్కొన్న గుర్తింపు, గౌరవాలు మళ్లీ మనకు ఏదో ఒకరోజు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాత్రం 2019లో లోక్సభలో ఈ అంశంపై అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపాయి. ప్రభుత్వం అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటేసింది. మేము సుప్రీం కోర్టుకు వెళ్లాం. ఇప్పుడు సుప్రీం కోర్టు తన నిర్ణయం తెల్పింది. ఇక ఇప్పుడు చెప్పగలిగిందేమీ లేదు. ప్రతిఒక్కరూ సుప్రీం కోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తారని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 2019 లోనే ఆర్టికల్ 370 రద్దును సమర్ధించింది.
ఆర్టికల్ 370ఎ కేంద్రం రద్దు చేయడానికి ఒకరోజు ముందు 2019 ఆగస్టు 4న శ్రీనగర్ లోని గుప్కర్ రోడ్డులోని నేషనల్ కాన్ఫరెన్సు అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా నివాసంలో కాంగ్రెస్ సహా పిడిపి, ఎన్సి పార్టీలు సమావేశమై ఆర్టికల్ 370ని సమర్ధిస్తూ ఉమ్మడి ప్రకటన చేశాయి. 2020 నవంబర్ తర్వాత పిఏజిడి నుండి కాంగ్రెస్ తప్పుకొంది. అది తప్పుకోవడానికి ఒకరోజు ముందు కేంద్ర మంత్రి అమిత్షా పిఏజిడిని గుప్కర్ గ్యాంగ్ గా అపవిత్ర గ్లోబల్ ఘట్బంధన్ గా అభివర్ణించారు. అంతకు ముందు జమ్ముకాశ్మీర్కు రాష్ట్ర హోదా తొలగించాక అక్కడి ప్రజలు ఉపాధి కుంభకోణాలతో, భూమి మాఫియా, వైన్షాపులు, స్మార్ట్ మీటర్లు వగైరా రూపంలో దారుణమైన బాధలు పడాల్సి వచ్చిందని కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ చెప్పింది.
ఆర్టికల్ 370 నేపథ్యం
దేశ విభజన సందర్భంగా కాశ్మీర్ రాజు హరిసింగ్ తాను స్వతంత్ర రాజుగానే కొనసాగుతానని చెప్పారు. ఒక తుది నిర్ణయానికి రాక ముందే స్థానిక ఆదివాసీల ముసుగులో పాకిస్తాన్ సైన్యాలు కాశ్మీరుపై దాడి చేశాయి. మహారాజ హరిసింగ్ లోయను వదలి సురక్షితంగా వేరే ప్రాంతానికి వెళ్ళారు. ఆ దశలో ఆనాటి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా (ఫరూక్ అబ్దుల్లా తండ్రి) ప్రధాన పాత్ర పోషించి భారత సైన్యాలు అక్కడ జోక్యం చేసుకొనేట్లు చూశారు. కాశ్మీర్లో 80 శాతం జనాభా ముస్లింలున్నా వారు పాకిస్తాన్తో విలీనం కావాలనుకోలేదు.
అయితే ఏదో ఒక ఒప్పందం లేకుండా, భారతదేశం తన సైన్యాలను అక్కడికి ఎలా పంపగలదని నెహ్రూ ప్రశ్నించారు. నెహ్రూ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గమనంలో ఉంచుకొని ఆ రాష్ట్ర ప్రజల రక్షణ కోసం భారత రాజ్యాంగంలో 370 ఆర్టికల్ని చేర్చుతూ హరిసింగ్తో ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందంలోని ప్రధాన అంశం ”ఇద్దరు ప్రధానులు రెండు రాజ్యాంగాలు” (దో ప్రధాన్, దో విధాన్). భారత ప్రభుత్వం ఆ రాష్ట్ర రక్షణతో పాటు విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు, కరెన్సీలను చూసుకోవాలి. ఇతర అంశాలను కాశ్మీరు రాష్ట్ర్ర అసెంబ్లీ నిర్ణయిస్తుంది. కాశ్మీరు తన స్వంత రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి. ఆ షరతుల ప్రకారం భారత ప్రభుత్వం తన సైన్యాలను అక్కడికి పంపింది. ఆలోగా పాకిస్తాన్ కాశ్మీరు లోని మూడవ వంతు భాగాన్ని ఆక్రమించుకొంది. ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం రెండు దేశాలూ తమ సైన్యాలు అక్కడ నుంచి ఉపసంహరించుకున్నాక ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) జరపాలి. కాని అది ఇప్పటిదాక జరగలేదు. తన ఆధీనంలో ఉన్న కాశ్మీరును ఆజాద్ కాశ్మీరుగా పాకిస్తాన్ ప్రకటించింది. క్రమంగా భారత్ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని దిగజార్చింది. 17 ఏళ్ల పాటు షేక్ అబ్దుల్లాను జైల్లో ఉంచింది. ఈ మధ్య కాలంలో ప్రధాన మంత్రి హోదాను ముఖ్యమంత్రి హోదాగా, సదర్-ఏ-రియాసత్ హోదాను గవర్నరుగా మార్చారు. క్రమంగా భారత రాజ్యాంగాన్ని కాశ్మీరుకు వర్తింపచేశారు. ప్రజాతంత్ర ప్రక్రియ అక్కడ క్రమంగా బలహీన పడింది.
ఫరూఖ్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని 1984లో రద్దు చేశారు. ఆ తర్వాత 1987లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రిగ్గింగ్ చేసి గెలిచిందని ఆయన ఆరోపించారు. అక్కడి ప్రజల్లో పూర్తిగా భ్రమలు తొలగి, యువకులు హింసా రాజకీయాల్లోకి వెళ్లారు. మిలిటెన్సీ పెరిగిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకొని పాకిస్తాన్ తన మిలిటెంట్లను అక్కడికి పంపనారంభించింది. పరిస్థితి రోజు రోజుకూ దిగజారింది. ఆ సమయంలో ఫరూక్ అబ్దుల్లాను ఏడేళ్ల సుదీర్ఘకాలం జైలుకు పంపారు. ఆ స్థితిలో సోవియట్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అమెరికా సృష్టించిన అల్ఖైదా తన లక్ష్యం సాధించాక కాశ్మీరు లోయలోకి అడుగు పెట్టింది.
కాశ్మీరు పరిస్థితిని టెర్రరిజమ్ మరింత క్షీణింప చేసింది. స్థానిక ముస్లిం జనాభాకు, కాశ్మీరు పండిట్లకు మధ్య ఉన్న సామరస్యం స్థానంలో మతతత్వ కోణం జోడించారు. ఈ వక్రీకరణ టెర్రరిస్టులకు ఉపయోగపడింది. టెర్రరిస్టుల లోని ఒక సెక్షన్ హిందువులను లక్ష్యంగా చేసుకుంది. కాశ్మీరు లోని ముస్లింలందరూ టెర్రరిస్టులనే భావనతో అప్పటి గవర్నరు జగ్మోహన్ ప్రవర్తించారు. పండిట్లు కాశ్మీరు లోయను వదిలి వెళ్తే! తాను మిలిటెంట్లను ఏరేయగలనని గవర్నర్ భావించారు. గవర్నరు ప్రోత్సాహంతో పండిట్లు లోయను వదిలి కాందిశీకుల శిబిరాల్లో తలదాచుకొన్నారు. టెర్రరిస్టుల వల్ల ముస్లిం జనాభా సైతం చాలా బాధలను అనుభవించింది. వారిని కూడా టెర్రరిస్టులు చంపారు. కొందరు ముస్లింలు కూడా లోయను వదిలేసి వచ్చారు. రెండు పొరుగు దేశాల మద్య ఏర్పడిన సమస్యకు మతం రంగు అద్దారు.
భారత ప్రభుత్వం అక్కడి ప్రజల జాతి ఆకాంక్షలను అణిచి వేసింది. ఎన్నికైన ప్రభుత్వాలను పదే పదే తొలగించింది. తమకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండును పట్టించుకోలేదు. అవుట్లుక్ పత్రిక (2000 అక్టోబరు 16) జరిపిన అభిప్రాయ సేకరణలో 74 శాతం మంది కాశ్మీరీలు తమకు ప్రత్యేక గుర్తింపు కావాలని కోరారు. 16 శాతం మంది కాశ్మీరుకు స్వయం ప్రతిపత్తి కావాలన్నారు. కేవలం రెండు శాతం మాత్రమే పాకిస్తాన్తో విలీనం కావాలని కోరారు. 39 శాతం మంది ప్రజలు తమకు భారత రాజ్యాంగం పరిధిలోనే పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. మిలిటెంట్ల ప్రధాన కార్యకలాపాలు 1990 నుండి ప్రారంభమయ్యాయి. అంటే 1987లో రిగ్గింగ్ ద్వారా జరిగిన ఎన్నికల తర్వాత అన్నమాట. కేంద్ర ప్రభుత్వంతో పాటు కాశ్మీరీలు ఎన్నుకొన్న ప్రభుత్వాలు కూడా అక్కడి సాధారణ ప్రజల అభ్యున్నతికి కృషి చేయనందున కాశ్మీర్ సమస్య మానని పుండులా మారింది.