ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ కానున్న నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లును సాధ్యమైన త్వరగా పూర్తి చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పర్చాలని జిల్లా ఎన్నికల అధికారులను, పోలీస్ సూపరింటెండెంట్లను, పోలీస్ కమిషనర్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు, ఎన్నికల ముందస్తు ఏర్పాటులను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్ లు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, కేసుల నమోదు తదితర అంశాలపై సిఒఒకు వివరించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత చెక్ పోస్టుల ద్వారా చేపట్టిన తనిఖీలు, సీజ్ చేసిన వస్తువులు, నగదు తదితర అంశాలపై జిల్లా ఎస్.పి. దీపిక పాటిల్ వివరించారు. సాధారణ ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఏర్పాట్లకు అవసరమైన భద్రత సిబ్బందిని సమకూర్చుకునే విషయమై వివరిం చారు. జాయింట్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఒ ఎస్.డి. అనిత, ఆర్డిఒలు, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు