న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని అత్యున్నత కమిటీ నియమించే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి), ఎలక్షన్ కమిషర్(ఈసి)ల నియామకంపై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి నోటీసులిచ్చింది. ఏప్రిల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కేంద్రాన్ని ఆదేశించింది. సిఈసి, ఈసి నియామకం, వారి విధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఈ చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఈ చట్టాన్ని తాము ఎలా నిలువరించగలం అని ధర్మాసనం పిటిషనర్ తరుపు న్యాయవాది డా. జయ ఠాకూర్ని ప్రశ్నించింది. ఈ కేసుపై ఏప్రిల్లో విచారణకు జాబితా చేసేందుకు అంగీకరించింది.