ప్రజాశక్తి-గుంటూరు : ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడల ప్రారంభోత్సవానికి మంగళవారం సీఎం జగన్ నల్లపాడు రానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు కలకలం సష్టించింది. ‘పోరంబోకు భూమి కాపాడు జగనన్న’ అంటూ చల్లా అచ్చిరెడ్డి పేరుతో నల్లపాడులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.
‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను ప్రారంభించడానికి సీఎం వైఎస్ జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. పదిన్నరకు నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ కు సీఎం చేరుకోనున్నారు. శాప్ జెండా, జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం ఉపన్యాసం ఇస్తారు. ఆపై క్రీడా జ్యోతిని వెలిగించి ‘ఆడుదాం ఆంధ్రా’ టోర్నమెంట్ ను ప్రారంభిస్తారు. ఆ తరువాత క్రీడాకారులతో సీఎం జగన్ ఇంటరాక్షన్ అవుతారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తిరిగి తాడేపల్లికి సీఎం చేరుకుంటారు. ఈ ఆటల పోటీలు ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- తెలుగు యువత, విద్యార్థి సంఘాల నాయకుల నిరసన
జగన్ పర్యటనను తెలుగు యువత, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ”ఆడుదాం ఆంధ్రా సరే.. ఆట స్థలాలు ఎక్కడ” అని నినాదాలు చేస్తూ గుంటూరు చుట్టు గుంట కూడలిలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.