ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే ప్రజా ప్రతినిధులకు వినతులు అందించారు. గురువారం సిఎంకు ఉత్తరాలు రాస్తూ నిరసన తెలిపారు. నేడు భీమవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సిఐటియు నాయకులను అక్రమ అరెస్టులకు నిరసనగా కాళ్ళ పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీ, ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. అక్రమంగా అరెస్టు చేసిన సిఐటియు నాయకులను విడుదల చేయాలని కాళ్ళ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అరెస్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పగో : సమ్మె 18వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఇలా అంకె రూపంలో నిలబడుతూ…
చిత్తూరులో అంగన్వాడీ, ఎస్ ఎస్ ఏ, మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిఐటియు- ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన
అంగన్వాడీల సమ్మెలో భాగంగా 18వ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపిన అంగన్వాడీలు.
- సామర్లకోటలో 18వ రోజు అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు
కాకినాడ -సామర్లకోట రూరల్ : తమ డిమాండ్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆందోళన శుక్రవారం 18వ రోజు కొనసాగింది. సామర్లకోట మండల తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు ఏ అమరావతి కార్యదర్శి టి నాగమణిల ఆధ్వర్యంలో సామూహిక రిలే నిరాహార దీక్షలు ఆందోళన చేపట్టారు. ఆందోళనకు ముఖ్యఅతిథిగా హాజరైన అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈ చంద్రావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వితండవాదం చేయకుండా తక్షణమే అంగన్వాడీల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ సమ్మె కొనసాగిస్తామన్నారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరుతూ మద్దతుగా దీక్షా శిబిరంలో సామర్లకోట ఐఎంఎల్ డిపో హమాలిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వి అప్పలరాజు, అర్జున్ రావు
హమాలి రాష్ట్ర కార్యదర్శి విప్పార్తి కొండలరావు, గోవింద్,బుజ్జి,శేఖర్ కూర్చొని సంఘీభావం ప్రకటించారు. ఆందోళనలో అంగన్వాడీ యూనియన్ నాయకులు వి ఎస్తేరు రాణి, ఏ వాణిదేవి, కే వరలక్ష్మి, బాలలక్ష్మి, జి మహాలక్ష్మి, ఎన్ మంగ లక్ష్మి, డి రజిని, అర్బన్ రూరల్ పరిధిలో 1087 అంగన్వాడి కేంద్రాలకు చెందిన సుమారు 400 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఆందోళనలో పాల్గొన్నారు.
తిరుపతిలో ఒసేయ్ రాములమ్మ… పాటకు డాన్స్ వేస్తూ నిరసన…
- అక్రమ నిర్బందాలను ఖండిస్తున్నాం : యుటిఎఫ్
పగో-కాళ్ళ : యుటిఎఫ్ నాయకులను పోలీస్ స్టేషన్ లో నిర్భందించడం వంటి అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నామని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణంరాజు శుక్రవారం తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి. గోపీ మూర్తి, అద్యక్షులు పి. ఎస్.విజయ రామరాజు, ప్రధాన కార్యదర్శి ఎ. కె. వి.రామభద్రం, కాళ్ల మండల ప్రధాన కార్యదర్శి ఎం.శంకర్ రావు యు టి ఎఫ్ నాయకులను అరెస్టు చేయడం సరైనది కాదన్నారు.ఇప్పటికైనా సి పి ఎస్ రద్దు చేసి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.
ఆకివీడు పోలీస్ స్టేషన్లో నిర్భందించిన భీమవరం పట్టణ భీమవరం రూరల్ అంగన్వాడీలకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ పోలీస్ స్టేషన్ కు చేరిన ఆకివీడు పట్టణ, మండల అంగన్వాడీలు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట కచేరి సెంటర్లో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.
చాగల్లులో 18వ రోజుకి చేరిన అంగన్వాడి దీక్షలు
తూగో – చాగల్లు : అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడి వర్కర్స్,హెల్పర్స్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు. వీళ్లకు మద్దతుగా సిఐటియు మండల కార్యదర్శి కేకే దుర్గారావు పాల్గొన్నారు. చాగల్లు తహశీల్దార్ కార్యాలయం సమీపంలో చేపట్టిన దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పి విజయ కుమారి, కె లక్ష్మి, కే దమయంతి, ఏ శ్రీదేవి, ఎస్ అరుణ కుమారి ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన… నినాదాలు…
పశ్చిమ గోదావరి-పాలకొల్లు : గత ఎన్నికల్లో జగన్ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా మంచి జీతాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి తమ చెవిలో పువ్వు పెట్టారని మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి చెప్పారు. పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద 18 వ రోజు సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ఆమె సంఘీభావం తెలిపారు. అమ్మ తరువాత అమ్మ వంటి మిమ్మల్ని రోడ్ పైకి తీసికొనివచ్చిన జగన్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. పిల్లలతో ఎక్కువ సమయం గడిపే మీకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అయిన జగన్ వైఖరిలో మార్పు లేదని చెప్పారు.
ఉండి : అక్రమ అరెస్టులు అన్యాయమని ఉండి మండల అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మత్తి చైతన్య, డి సత్యవేణి అన్నారు. ఉండి తహసిల్దార్ కార్యాలయం వద్ద గత 18 రోజుల నుంచి సమ్మె చేస్తున్న తమను భీమవరం సీఎం పర్యటనకు వెళ్లకుండా అడ్డుకునే అక్రమ అరెస్టు చేయడం ప్రభుత్వ దుర్మార్గపు చర్యకు నిదర్శనం అన్నారు. తమకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో అంగన్వాడీల సత్తా చూపిస్తామని వారి హెచ్చరించారు.