ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : అంగన్ వాడీలపై ప్రభుత్వ నిర్బంధంపై నిరసన పెరుగుతోంది. తొలగింపు ఉత్తర్వులు ఇస్తామని బెదిరింపులకు దిగుతోంది. విజయవాడ జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వెళ్లకుండా అంగన్ వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. అక్రమ అరెస్టులు చేశారు. పలువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు. సోమవారం సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.రామును అచ్యుతాపురంలో గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ అణచి వేత చర్యలను నిరసిస్తూ అంగన్ వాడీలు అనకాపల్లి నెహ్రు చౌక్ వద్ద రాస్తారోకో చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అక్కడకు ర్యాలీగా వెళ్లారు. అంగన్ వాడీల అక్రమ అరెస్టులను సిపిఎం ఖండించింది. వారి పోరాటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం మద్దతు తెలిపారు. అనేక చోట్ల అంగన్ వాడీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకర రావు, కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, కోశాధికారి నాయన బాబు, విఓఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రూపావతి తదితరులు పాల్గొన్నారు.