చెన్నై : తమిళనాడులోని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పరిశ్రమలో మంగళవారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలోని పైపులైన్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకవ్వడంతో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. అమ్మోనియా అన్లోడ్ చేస్తున్న సబ్-సీ పైప్లైన్లో లీకులు ఏర్పడినట్లు తెలుస్తుంది.
కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ కంపెనీ ఎన్నూర్లో ఉంది. ఈ పరిశ్రమలో ఎరువులు తయారీ జరుగుతుంది. ఇందుకు అమ్మోనియాను ముడిసరుకుగా వాడతారు. అయితే.. మంగళవారం అర్ధరాత్రి 12:45 సమయంలో సముద్ర తీరంలో పైప్లైన్ ప్రీ-కూలింగ్ ఆపరేషన్ జరుగుతుండగా, పైప్లైన్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఘాటైన గ్యాస్ వాసన వ్యాపించడంతో స్థానిక పెరియకుప్పం, చిన్నకుప్పం గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య శాఖా అధికారులు.. ఆయా గ్రామాల్లో అంబులెన్స్లు, ఇతర ట్రాన్స్పోర్టు సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 మంది ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. గ్యాస్ లీకేజీతో స్థానిక గ్రామాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
అత్యున్నత భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాం : కోరమండల్ సంస్థ
సముద్ర తీరానికి సమీపంలో అమ్మోనియా అన్లోడ్ చేస్తున్న సబ్-సీ పైప్లైన్లో మంగళవారం రాత్రి 11.30 గంటలకు లీకు ఏర్పడినట్లు కోరమండల్ సంస్థ తెలిపింది. వెంటనే అమ్మోనియా సరఫరాను తక్కువ చేసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చామని పేర్కొంది. ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించామని వెల్లడించింది. కోరమండల్ ఎల్లప్పుడూ అత్యున్నత భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది.