ప్రజాశక్తి-విజయనగరంకోట : రెండో ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఇవిఎంలను కేటాయించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా, సీతారామ్ జాట్ సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి కలెక్టరేట్ ఎన్ఐసి కేంద్రంలో బుధవారం ఈ ప్రక్రియ నిర్వహించారు. కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఇవిఎంలను ఎంపిక చేశారు. నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్యకు రిజర్వు నిమిత్తం అదనంగా 20 శాతం బ్యాలెట్ యూనిట్లు, 20 శాతం కంట్రోల్ యూనిట్లు, 30 శాతం వివి ప్యాట్లను కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం రాజాం నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్లు 340, కంట్రోల్ యూనిట్లు 340, వివి ప్యాట్లు 369, బొబ్బిలికి బియులు 316, సియులు 316, వివి ప్యాట్లు 343, చీపురుపల్లికి బియులు 308, సియులు 308, వివి ప్యాట్లు 334, గజపతినగరానికి బియులు 316, సియులు 316, వివి ప్యాట్లు 343, నెల్లిమర్లకు బియులు 297, సియులు 297, వివి ప్యాట్లు 322, విజయనగరానికి బియులు 312, సియులు 312, వివి ప్యాట్లు 338, శృంగవరపుకోటకు బియులు 324, సియులు 324, వివి ప్యాట్లు 351 కేటాయించారు. పార్లమెంటు ఎన్నికలకు కూడా దాదాపు ఇంతే సంఖ్యలో బియు, సియు, వివి ప్యాట్లు కేటాయించగా, విశాఖ పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం, అక్కడ ఎంపి కి పోటీ చేసే అభ్యర్ధుల సంఖ్య అధికంగా ఉండటంతో 972 బ్యాలెట్ యూనిట్లను కేటాయించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఆర్ఒ ఎస్డి అనిత, ఇవిఎంల నోడల్ అధికారి బి.ఉమాశంకర్, రిటర్నింగ్ అధికారులు, పోటీ చేస్తున్న అభ్యర్ధులు, వారి ప్రతినిధులు పాల్గొన్నారు.