- ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతం
ప్రజాశక్తి – బాపట్ల జిల్లా : బాపట్ల జిల్లాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై నిర్వహించిన ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. అత్యవసర పరిస్థితులలో విమానాలు కిందకు దిగడానికి కోరిశపాడు మండలం పిచికల గుడిపాడు వద్ద 16 నెంబర్ జాతీయ రహదారిపై 4.1 కిలో మీటర్ల పొడవునా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నిర్మించారు. భారత వైమానిక దళం అధికారులు ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ సోమవారం నిర్వహించారు. ఈ .ట్రయిల్ రన్ కార్యక్రమానికి ఒంగోలు జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ పర్యవేక్షణలో 524 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు. ఉదయం నుంచి జాతీయ రహదారిపై వాహనాలను దారి మళ్లించారు. ఈ సందర్భంగా ఎస్సి మాట్లాడుతూ వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులతోపాటు అత్యవసర పరిస్థితులలో విమానాలకు ల్యాండింగ్ సౌకర్యం కల్పించారని తెలిపారు. గత డిసెంబర్లో ట్రయిల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రెండో దఫా వైమానిక దళం అధికారులు నిర్వహించిన ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్యు 30, హెచ్ఎహెచ్ఎడబ్ల్యుకెఎన్ 32, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్లతో ట్రయల్ రన్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైమానిక దళ అధికారులు విజరుమీనన్, జెపి.యాదవ్ తదితరులు పాల్గొన్నారు.