గ్రూప్‌-1, 2 అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలి: లోకేశ్‌

అమరావతి: గ్రూప్‌-1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగార్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ జారీలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల నిర్లక్ష్యం యువత భవితను నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున నోటిఫికేషన్ల పేరుతో మరోసారి వంచనకు సిద్ధమయ్యారని లోకేశ్‌ విమర్శించారు.కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేదే వైసిపి కుట్ర అని లోకేశ్‌ విమర్శించారు. అధికారంలోకి రాకముందు చాలా హామీలిచ్చారని.. ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా యలమంచిలిలో విశ్రాంత ఉద్యోగులతో లోకేశ్‌ ముఖాముఖి మాట్లాడారు. పేదవాళ్లకూ వైసిపి దోపిడీదారులకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. అడ్డగోలుగా దోచుకోవడాన్నే వైసిపి పనిగా పెట్టుకుందని అన్నారు. ఇసుక, మద్యం ఇలా ప్రతి దాంట్లో దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు.

➡️