– అంతకంతకూ పెట్టుబడుల విస్తరణ
– తాజాగా ‘ఐఎఎన్ఎస్’ అదాని వశం
– డిస్నీ ఇండియా కొనుగోలుకు అంబాని కసరత్తు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితులుగా పేరొందిన అదానీ గ్రూపు అధినేత గౌతమ్, రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముకేష్ అంబానీ ప్రసార మాధ్యమాలు, మీడియా రంగాలపై పట్టు బిగిస్తున్నారు. జాతీయ స్థాయి వార్తా సంస్థలను, వార్తా ఏజెన్సీలను, వినోద పరిశ్రమలనూ ఒక్కొటక్కటిగా స్వాధీనం చేసుకుంటూ గుత్తాధిపత్యం సాగిస్తున్నారు. తాజాగా ఐఎఎన్ఎస్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ న్యూస్ ఎజెన్సీలో మెజారిటీ వాటాలను కొనుగోలు చేసి అదానీ గ్రూపు స్వాధీనం చేసుకుంది. ఇదే విషయాన్ని అదాని ఎంటర్ప్రైజెస్ శనివారం రెగ్యూలేటరీ సంస్థలకు వెల్లడించింది. గతేడాది మార్చిలో బిజినెస్, ఫైనాన్షియల్ న్యూస్ అందించే క్వింటిలియన్ బిజినెస్ మీడియాను కొనుగోలు చేసి మీడియా రంగంలోకి ప్రవేశించిన అదాని.. ఇటీవల ఎన్డిటివిని ఒత్తిడి చేసి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్డిటివిలోని 65 శాతం మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదాని గ్రూపు సంస్థల్లో ఒక్కటైన ఎఎంజి మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ ద్వారా ఐఎఎన్ఎస్లో 50.5 శాతం వాటాను కొనుగోలు చేసింది. కాగా.. ఎంత మోత్తానికి ఈ వాటాను స్వాధీనం చేసుకున్నారనేది వెల్లడించకపోవడం గమనార్హం. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో ఐఎఎన్ఎస్ ఆదాయం రూ.11.86 కోట్లుగా నమోదయ్యింది. మరోవైపు డిస్నీ ఇండియాను స్వాధీనం చేసుకోవడానికి ముకేష్ అంబానికి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ వేగంగా కసరత్తు చేస్తోంది. రిలయన్స్కు చెందిన వయాకామ్ 18, డిస్నీ హాట్స్టార్ ఇండియా సంస్థల విలీనంపై వచ్చే ఏడాది జనవరి నాటికీ ప్రకటన వెలువడే వీలుంది. ఒప్పందం ఖరారు అయితే డీస్నిలో రిలయన్స్ వాటా 51 శాతానికి చేరుకుంటుంది. ప్రస్తుతం డిస్నీకి చెందిన స్టార్ ఇండియాకు 77 న్యూస్, ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు ఉండగా.. వయాకామ్కు 38 ఛానళ్లు ఉన్నాయి. డిస్నీకి డిస్నీ హాట్స్టార్, రిలయన్స్కు జియో సినిమా స్ట్రీమింగ్ వేదికలు ఉన్న విషయం తెలిసిందే.