న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్క్ను దాటినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం 8 గంటల నుండి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 312 కొత్త కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,742 నుంచి 4,054కు పెరిగింది.
కేరళలో అత్యధికంగా 128 కేసులు నమోదు కగా, ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. దీంతో కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,033కి చేరింది. మహారాష్ట్రలోని థానేలోనూ 5 కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. నవంబర్ 30 నుంచి 20 నమూనాలను పరీక్షించగా థానే నగరంలో ఐదు జెఎన్1 వేరియంట్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో క్రియాశీల కేసుల సంఖ్య 28కి పెరిగింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. 24 గంటల్లో 315 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు చేరుకుంది.